కరోనా పాలసీల కాలపరిమితి పొడిగింపు!
ABN , First Publish Date - 2020-09-13T06:01:13+05:30 IST
కొవిడ్-19 కేసులు గణనీయంగా పెరిగిపోతున్న తరుణంలో కరోనా కవచ్, కరోనా రక్షక్ పాలసీలకు డిమాండ్ కూడా అదే స్థాయిలో పెరిగిపోతోంది.
కొవిడ్-19 కేసులు గణనీయంగా పెరిగిపోతున్న తరుణంలో కరోనా కవచ్, కరోనా రక్షక్ పాలసీలకు డిమాండ్ కూడా అదే స్థాయిలో పెరిగిపోతోంది. ఈ ఏడాది జూలై 10న 3.5 నెలలు, 6.5 నెలలు, 9.5 నెలల కాలపరిమితితో బీమా కంపెనీలు ఈ పాలసీలను విక్రయించేందుకు బీమా నియంత్రణ, అభివృద్ధి మండలి (ఐఆర్డీఏఐ) అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు కొవిడ్-19 ప్రత్యేక పాలసీల ద్వారా 15 లక్షల మంది బీమా సదుపాయాన్ని వినియోగించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తుండటంతో కరోనా కవచ్, కరోనా రక్షక్ పాలసీల కాలపరిమితిని పెంచే దిశగా ఐఆర్డీఏఐ కసరత్తు చేస్తోంది. అంతేకాకుండా ఈ పాలసీలను మెయిన్స్ట్రీమ్లోకి తీసుకురావటమే కాకుండా రెన్యువల్ చేస్తే విషయాన్ని పరిశీలిస్తోంది. కరోనా కవచ్ పాలసీ సమ్ అష్యూర్డ్ రూ.50,000 నుంచి రూ.5 లక్షల వరకు ఉండగా కరోనా రక్షక్ మాత్రం ఫిక్స్డ్ బెనిఫిట్ ప్లాన్. ఇందులో కరోనా కవచ్ పాలసీకి విస్తృతమైన ఆదరణ లభిస్తోంది. ఈ పాలసీ ప్రతి వారం 15 శాతానికి పైగా వృద్ధిని నమోదు చేసుకుంటూ వస్తుండటం గమనార్హం. మరోవైపు సాధారణ బీమా కంపెనీలు ఈ నెల పదో తేదీ నాటికి 2.07 లక్షల క్లెయిమ్స్ను అందుకున్నాయి. ఈ క్లెయిమ్స్ విలువ రూ.3,255 కోట్లు.