భారత్ చాలా మంచి నిర్ణయం తీసుకుంది: ఆంథోనీ ఫౌసీ
ABN , First Publish Date - 2021-05-14T17:47:43+05:30 IST
కొవిషీల్డ్ టీకా మొదటి, రెండో డోసుల మధ్య గడువును 12 నుంచి 16 వారాలకు పొడిగిస్తూ కేంద్రం ఇటీవల నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. భారత్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని అమెరికా అంటువ్యాధుల నివారణ నిపుణుడు డా. ఆంథోనీ ఫౌసీ స్వాగతించారు.
వాషింగ్టన్: కొవిషీల్డ్ టీకా మొదటి, రెండో డోసుల మధ్య గడువును 12 నుంచి 16 వారాలకు పొడిగిస్తూ కేంద్రం ఇటీవల నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. భారత్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని అమెరికా అంటువ్యాధుల నివారణ నిపుణుడు డా. ఆంథోనీ ఫౌసీ స్వాగతించారు. భారత్లో టీకాల కొరత ఉన్నందున కొవిషీల్డ్ రెండు డోసుల మధ్య వ్యవధిని 12 నుంచి 16 వారాలకు పెంచడాన్ని ఆయన చాలా మంచి నిర్ణయంగా అభిప్రాయపడ్డారు. కష్ట సమయంలో ఎక్కువ మందికి శరవేగంగా వ్యాక్సిన్ వేసేందుకు ఇది ఉపయోగకరంగా ఉంటుందన్నారు. వ్యాక్సినేషన్కు తగినన్ని టీకాలు దేశంలో లేనప్పుడు డోసుకు- డోసుకు మధ్య వ్యవధిని పొడగించడమనేది చాలా ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపారు.
అలాగే భారత్ టీకాల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకుంటూనే ఇతర దేశాలు, కంపెనీలతో ఒప్పందాలు చేసుకోవాలని సూచించారు. ఇక ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఏ దేశమైనా ఆర్మీ సాయం తీసుకోవడం మంచిదని ఫౌసీ అన్నారు. కాగా, మోతాదుల మధ్య గడువు పెంపు వ్యాక్సిన్ సమర్థతపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం సైతం చాలా తక్కువని తెలిపారు. వ్యవధి పెంచడం కారణంగా ఎక్కువ మంది ప్రజలకు టీకాలు ఇచ్చే వీలు ఏర్పడుతుందన్నారు. ఇక రష్యాకు చెందిన స్పూత్నిక్-వీ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి భారత్ ఆమోదం తెలపడం కూడా చాలా మంచి నిర్ణంగా ఫౌసీ పేర్కొన్నారు.
త్వరలో భారత్లో అందుబాటులోకి రానున్న రష్యా టీకా 90 శాతం సమర్థతతో పని చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. భారత్లో వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్నందున దాన్ని అరికట్టేందుకు మొత్తం మూడు టీకాలు చాలా బాగా పనిచేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. ఈ క్లిష్ట సమయంలో భారత్ను ఆదుకునేది కేవలం వ్యాక్సినేషన్ మాత్రమేనని మరోసారి ఫౌసీ పునరుద్ఘటించారు. కనుక వీలైనంత త్వరగా సాధ్యమైనంత ఎక్కువ మందికి టీకా అందించే ప్రయత్నం చేయాలని సూచించారు.