చికెన్ వ్యాపారుల దోపిడీ
ABN , First Publish Date - 2021-05-17T05:06:19+05:30 IST
నగరంలో చికెన్ రిటైల్ వ్యాపారులు అడ్డగోలుగా ధరలు పెంచి విక్రయాలు చేపడుతున్నారు స్కిన్లెస్ కిలో రూ.200 చొప్పున ఆదివారం విక్రయించారు.
అధిక ధరకు విక్రయాలు
విశాఖపట్నం, మే 16 (ఆంధ్రజ్యోతి): నగరంలో చికెన్ రిటైల్ వ్యాపారులు అడ్డగోలుగా ధరలు పెంచి విక్రయాలు చేపడుతున్నారు స్కిన్లెస్ కిలో రూ.200 చొప్పున ఆదివారం విక్రయించారు. కొవిడ్ ప్రభావంతో వినియోగదారులు ధర విషయంలో ప్రశ్నించకపోవడంతో దోపిడీ సాగుతోంది. కొవిడ్ సమయంలో చికెన్ తింటే ఇమ్యూనిటీ పెరుగుతుందన్న వైద్యుల సూచనతో వినియోగదారులు షాపుల ముందు క్యూకట్టారు. ప్రతి ఆదివారం నగరంలో నాలుగు లక్షల కోళ్లు అంటే ఎనిమిది లక్షల కిలోల చికెన్ విక్రయాలు జరుగుతుంటాయని కంపెనీల అంచనా. కొవిడ్ ప్రభావంతో ఇవి మరింత పెరిగాయని చెబుతున్నారు. బ్రాయిలర్ చికెన్కు సంబంధించి ఉత్తరాంధ్ర మార్కెట్లో బ్యాగ్, వెన్కాబ్ సంస్థలు రోజువారీ ధరలు ప్రకటిస్తాయి. ఆదివారం మార్కెట్లో బ్యాగ్ కిలో స్కిన్లెస్ రూ.166లు, వెన్కాబ్ రూ.177గా నిర్ణయించాయి. సాధారణంగా కంపెనీలు నిర్ణయించిన రేటు లేదా ధరపై ఐదు నుంచి పది రూపాయలు ఎక్కువగా విక్రయిస్తుంటారు. కానీ.. ఆదివారం నగరంలో దాదాపుగా అన్ని రిటైల్ దుకాణాల్లో స్కిన్లెస్ రూ.200కు విక్రయించారు. కంపెనీలు హెచ్చరించినా రిటైలర్లు వినియోగదారుల్ని దోచుకునే ప్రయత్నం చేస్తున్నారని కోళ్లరైతులు వ్యాఖ్యానిస్తున్నారు. కంపెనీలు నిర్ణయించిన ధరకే విక్రయాలు చేపట్టాలని బ్యాగ్ అధ్యక్షుడు టి.అప్పారావు తెలిపారు. నగరంలో రిటైలర్లు అధిక ధరకు విక్రయాలు చేపట్టవద్దని సూచించారు.
గుడ్డుకూ గిరాకీ
కరోనా వేళ గుడ్డుకు గిరాకీ వచ్చింది. ఆదివారం నుంచి హోల్సేల్గా గుడ్డు ధర రూ.5గా నిర్ణయించారు. రిటైల్లో రూ.5.50 నుంచి రూ.6కు విక్రయిస్తున్నారు. గుడ్డు తింటే ఇమ్యూనిటీ పెరుగుతుందనే నిపుణుల సూచనతో డిమాండ్ పెరిగింది. దీంతో ధర పెరిగింది. కొవిడ్ ప్రభావంతో కోల్కతా, ఈశాన్య రాష్ట్రాలకు గుడ్లు ఎగుమతులు భారీగా తగ్గాయి. ఈ నేపథ్యంలో దీంతో స్థానికంగా ధర తగ్గాల్సి ఉన్నప్పటికీ, వినియోగం పెరగడంతో ధరలు పెంచారు.