అవసరమైతే సీఏఏపై అసెంబ్లీలో తీర్మానం: సజ్జల
ABN , First Publish Date - 2020-02-19T21:55:45+05:30 IST
సీఏఏ మీద ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అవసరం అయితే ఈ విషయంలో
అమరావతి: సీఏఏ మీద ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అవసరం అయితే ఈ విషయంలో అసెంబ్లీలో తీర్మానం చేయడానికి కూడా సిద్ధమేనని సజ్జల ప్రకటించారు. పార్లమెంట్లో సీఏఏకి వైసీపీ మద్దతు ఇచ్చినప్పుడు ఎన్పీఆర్, ఎన్ఆర్సీలు లేవని తెలిపారు. పార్లమెంట్లో బిల్లుకు మద్దతు ఇచ్చినప్పుడు మా వైఖరి స్పష్టంగా ప్రకటించామని చెప్పారు.
దేశ భద్రత, చొరబాట్లు, అక్రమ వలసల నిరోధం విషయంలోనే సీఏఏ బిల్లుకు వైసీపీ మద్దతు ఇచ్చిందని సజ్జల వివరించారు. ఆ తర్వాత కాలంలో ఎన్ఆర్సీ అంశం వచ్చిందని వెల్లడించారు. ముస్లిం మైనార్టీల ఆందోళన విషయంలో ప్రభుత్వం పూర్తి అవగాహనతో ఉందని స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వం ఉండగా వారికి ఎలాంటి ఇబ్బందులు రానివ్వమని హామీ ఇచ్చారు. చట్టాలు అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్రాలదేనని పేర్కొన్నారు. సీఏఏ, ఎన్ఆర్సీ విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన పని లేదని సజ్జల భరోసా ఇచ్చారు.