వ్యాక్సిన్ వచ్చే వరకూ వైర్సతో ముప్పే!
ABN , First Publish Date - 2020-04-14T17:28:00+05:30 IST
కరోనా మహమ్మారి మానవాళికి ముప్పుగా మారే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న వైరస్ ముప్పు నుంచి
వాషింగ్టన్, ఏప్రిల్ 13 : కరోనా మహమ్మారి మానవాళికి ముప్పుగా మారే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న వైరస్ ముప్పు నుంచి ఇప్పట్లో బయటపడే అవకాశాలు కనిపించడం లేదని డబ్ల్యూహెచ్వో ప్రత్యేక అధికారి డేవిడ్ నాబరో చెప్పారు. వ్యాక్సిన్ వచ్చే వరకు వైరస్తో పెనుముప్పు పొంచి ఉందన్నారు. వైరస్ వ్యాప్తిని అడ్డుకోవాలంటే ఎప్పటికప్పుడు వ్యాధి లక్షణాలున్న వారిని గుర్తించి ఐసొలేట్ చేసే ప్రక్రియను కొనసాగిస్తూనే ఉండాలని సూచించారు. కాగా.. 2009లో వచ్చిన స్వైన్ ఫ్లూ కంటే కరోనా వైరస్ 10 రెట్లు ఎక్కువ ప్రమాదకారి అని డబ్ల్యూహెచ్వో చీఫ్ టెడ్రోస్ చెప్పారు.
మనుషులపై 3 వ్యాక్సిన్ల ప్రయోగం!
కరోనా వైర్సను ఎదుర్కొనేందుకు 70 వ్యాక్సిన్లు అభివృద్ధి దశలో ఉన్నాయని డబ్ల్యూహెచ్వో తెలిపింది. ఇప్పటికే 3 వ్యాక్సిన్లను మనుషులపై ప్రయోగించి చూశారని తెలిపింది. హాంకాంగ్, చైనా, అమెరికాకు చెందిన సంస్థలు అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్లను మనుషులపై ప్రయోగించి చూశాయని వివరించింది. అవి వివిధ దశల్లో ఉన్నాయంది.