Chennai: సైలెంట్‌గా శశికళ తీవ్ర ప్రయత్నాలే చేస్తున్నారుగా.. శశికళ వ్యూహం ఫలించేనా?

ABN , First Publish Date - 2022-10-04T22:30:24+05:30 IST

అన్నాడీఎంకేలో ఏకనాయకత్వం దిశగా మాజీ ముఖ్యమంత్రులు పన్నీర్‌సెల్వం (ఓపీఎస్‌), ఎడప్పాడి పళనిస్వామి మధ్య ఏర్పడిన..

Chennai: సైలెంట్‌గా శశికళ తీవ్ర ప్రయత్నాలే చేస్తున్నారుగా.. శశికళ వ్యూహం ఫలించేనా?

చెన్నై (ఆంధ్రజ్యోతి): అన్నాడీఎంకేలో ఏకనాయకత్వం దిశగా మాజీ ముఖ్యమంత్రులు పన్నీర్‌సెల్వం (ఓపీఎస్‌), ఎడప్పాడి పళనిస్వామి మధ్య ఏర్పడిన విబేధాలను తమకు అనుకూలంగా మార్చుకుని పార్టీపై మళ్ళీ పట్టు సాధించేందుకు అమ్మా మక్కల్‌ మున్నేట్ర కళగం నేత టీటీవీ దినకరన్‌, అన్నాడీఎంకే అసమ్మతివర్గం నాయకురాలు శశికళ తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నారు. పార్టీపై న్యాయపోరాటం చేస్తున్న ఓపీఎస్‌ మద్దతుతో ఈపీఎస్‌ వర్గంలోని నాయకులను తమవైపునకు తిప్పుకునేందుకు పావులు కదుపుతున్నారు. వీరి వ్యూహరచన ఈపీఎస్‌ వర్గంపై ఎలాంటి ప్రభావం చూపటం లేదు కానీ ఆ వ్యూహాలపై అన్నాడీఎంకే మాజీ మంత్రులు, సీనియర్‌ నేతలు మండిపడుతున్నారు. వీరిద్దరి వెంట పార్టీ సర్వసభ్యమండలి సభ్యులుగానీ, ఎమ్మెల్యేలు, ఎంపీలుగాని లేరు. క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్న మాజీ నేతలు, మాజీ జిల్లా కార్యదర్శులు సుమారు వందమంది మాత్రమే ఇద్దరికీ మద్దతుగా వ్యవహరిస్తున్నారు.


ప్రస్తుతం అన్నాడీఎంకే నుంచి బహిష్కృతుడైన మాజీ ముఖ్యమంత్రి ఒ. పన్నీర్‌సెల్వం ఓ వైపు పార్టీలో పట్టుకోసం న్యాయపోరాటం చేస్తూ మరో వైపు శశికళ, దినకరన్‌తో కలిసి పనిచేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని తరచూ ప్రకటనలు చేస్తున్నారు. ఇక శశికళ తరచూ జిల్లాల పర్యటనలు చేస్తూ పార్టీలోని కోటిన్నరమంది కార్యకర్తలు తనకే మద్దతిస్తున్నారని, పార్టీ భవిష్యత్‌ కాపాడటమే తన ధ్యేయమని పదే పదే ప్రకటనలు చేస్తున్నారు. ఇక రెండు వారాలుగా దినకరన్‌, శశికళ పార్టీలో అసమ్మతికి తావులేకుండా ఓపీఎస్‌, ఈపీఎస్‌ కలిసి పనిచేయాలని, అందరూ ఐకమత్యంగా ఉండాలని పిలుపునిస్తూ ప్రకటనలు చేస్తున్నారు. అవి చూసి ఓపీఎస్‌ మాత్రమే హర్షం ప్రకటిస్తుండగా, ఈపీఎస్‌, ఆయన వర్గానికి చెందిన నాయకులతో వారిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.



కలిసుందాం రమ్మంటూ శశికళ, దినకరన్‌ పిలుపునివ్వడమే హాస్యాస్పదంగా ఉందని చెబుతున్నారు. పార్టీలో ప్రస్తుతం ఏకనాయకత్వం కొనసాగుతోందని, ఎలాంటి సంక్షోభాలకు తావులేదని, వాస్తవాలు ఇలా ఉండగా శశికళ, దినకరన్‌ను పార్టీలో చేర్చుకోవాల్సి అగత్యం కూడా లేదని కుండబద్దలు కొట్టినట్లు ప్రకటిస్తున్నారు. ఇటీవల శశికళ విలేఖరులతో మాట్లాడుతూ ప్రస్తు తం పార్టీలోని నాయకుల మధ్య విబేధాలు ఉన్నా తమ ఉమ్మడి ప్రత్యర్థి డీఎంకే మాత్రమేననే విషయాన్ని అన్ని వర్గాలు గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. రెండు రోజుల క్రితం దినకరన్‌ తంజావూరులో మీడియాతో మాట్లాడుతూ ఈపీఎస్‌ అనువైన సమయంలో తమ వర్గంలో విలీనమవుతారని సంచలనాత్మకంగా ప్రకటించారు. వారి వాదనలపై ఈపీఎస్‌ వర్గంలోని మాజీ మంత్రి డి, జయకుమార్‌, సీవీ షణ్ముగం, వేలుమణి తదితర నాయకులంతా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పార్టీ ప్రస్తుతం పటిష్టంగా ఉందని, ఎమ్మెల్యేలు, ఎంపీలు మాత్రమే కాకుండా సర్వసభ్యమండలికి చెందిన 90 శాతానికి పైగా ఈపీఎస్‌కే గట్టిమద్దతునిస్తున్నారని స్పష్టం చేశారు.

Updated Date - 2022-10-04T22:30:24+05:30 IST