ఓటర్ లిస్టుల సవరణలు వేగవంతం చేస్తున్నాం
ABN , First Publish Date - 2022-05-18T03:52:55+05:30 IST
ఓటర్ లిస్టుల సవరణలు వేగవంతం చేస్తున్నాం
- రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వీడియో కాన్ఫరెన్స్లో ఇన్చార్జి కలెక్టర్ హరీష్
మేడ్చల్, మే 17(ఆంధ్రజ్యోతి పత్రినిధి): మేడ్చల్ జిల్లాలో ఓటర్ల మార్పులు, చేర్పుల ప్రక్రియ వేగవంతంగా జరుగుతోందని, ఒకటి కంటే ఎక్కువచోట్ల ఓటు హక్కు కలిగి ఉన్న వారిని గుర్తించి పేర్ల తొలగింపు కార్యక్రమాన్ని వేగవంతంగా చేస్తున్నామని ఇన్చార్జి కలెక్టర్ హరీష్ పేర్కొన్నారు. మంగళవారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ వికా్సరాజ్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. పెండింగ్ దరఖాస్తులను వెంటనే క్లియర్ చేసి అందరికీ ఓటు హక్కు కల్పించాలని కలెక్టర్ను ఎన్నికల కమిషనర్ ఆదేశించారు. మేడ్చల్ జిల్లాలో ఓటర్ల ఫొటో ఎంట్రీ కార్యక్రమం కొనసాగుతోందన్నారు. ఓటర్ లిస్టుల్లో దొర్లిన తప్పులను సరిచేయడంతో పాటు చనిపోయిన వారి పేర్ల తొలగింపు ప్రక్రియా వేగవంతంగా చేస్తున్నామని ఇన్చార్జి కలెక్టర్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ దృష్టి తీసుకొచ్చారు. ఒకే వ్యక్తి వేర్వేరు చోట్ల వేర్వేరు ఫొటోలతో ఓటు హక్కు పొందిన వారినీ గుర్తించామని, ఓటు హక్కు ఎక్కడ కావాలో ఓటరు అభిప్రాయాన్ని తెలుసుకొని వారు కోరుకున్న చోట మాత్రమే పేరు ఉంచి మిగతా చోట్ల ఓటర్ లిస్ట్లో పేరు తొలగిస్తామని ఇన్చార్జి కలెక్టర్ ఎన్నికల కమిషనర్కు వివరించారు. తప్పుల్లేని ఓటర్ లిస్టులను తయారు చేస్తామన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ ఎ.నర్సింహారెడ్డి, డీఆర్వో లింగ్యానాయక్, ఆర్డీవో రవి, ఇతర అధికారులు పాల్గొన్నారు.