ధాన్యం డబ్బుకోసం ఎదురుచూపులు
ABN , First Publish Date - 2022-06-30T06:57:36+05:30 IST
జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రైతులకు పూర్తిస్థాయిలో చెల్లింపులు జరపకపోవడం పట్ల అంతటా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
రూ.82 కోట్ల బకాయిలపై మల్లగుల్లాలు
ఆందోళనలో 8800 మంది రైతులు
ఇప్పటికీ స్పష్టతనివ్వని అధికారులు
నిర్మల్ , జూన్ 29 ( ఆంధ్రజ్యోతి ) : జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రైతులకు పూర్తిస్థాయిలో చెల్లింపులు జరపకపోవడం పట్ల అంతటా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత కొద్దిరోజుల నుంచి రైతుల ధాన్యం డబ్బుల కోసం కొనుగోలు కేంద్రాలతో సంబంధిత అధికారుల చుట్టూ తిరుగుతున్నప్పటికీ స్పందన కనిపించడం లేదన్న ఆరోపణలున్నాయి. ప్రతీఏటా ఇదే మాదిరి చెల్లింపుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. ప్రస్తుత రబీలో మొత్తం రైతుల నుంచి 1,19,719 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. దీనికి సంబంధించి రూ.234 కోట్లను 28,382 మంది రైతులకు చెల్లించాల్సి ఉండగా ఇప్పటి వరకు 19500 మంది రైతులకు మాత్రమే రూ.152 కోట్లను చెల్లించారు. మిగతా 8882 మంది రైతులకు దాదాపు రూ.82 కోట్లను చెల్లించాల్సి ఉంది. రైతుల నుంచి డీఆర్డీఏ, పీఎసీఎస్, డీసీయంయస్, జీసీసీలు ధాన్యాన్ని కొనుగోలు చేశాయి. అయి తే 182 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొదట్లో కొనుగోలు కేంద్రాలను ఆలస్యంగా ఏర్పాటు చేయడం అలాగే కొనుగోలు కేంద్రాల్లో సరియైున సౌకర్యాలు కల్పించకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే చాలాసార్లు వర్షాలు కురియడంతో తమ ధాన్యం కూడా తడిసిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయకపోవడంతో మొదట్లో రైతులకు ఆటంకాలు తలెత్తాయి. ఎట్టకేలకు కొనుగోలు ప్రక్రియను పూర్తి చేసినప్పటికీ చెల్లింపుల విషయంలో మాత్రం ప్రభుత్వం మొండి వైఖరిని అవలంభిస్తుండడం పట్ల రైతులు ఆక్షేపణ వ్యక్తం చేస్తున్నారు. దాదాపు రైతులకు రూ.82 కోట్లను చెల్లించాల్సి ఉన్నప్పటికీ ఈ చెల్లింపులు ఎప్పటిలోగా పూర్తి చేస్తారోననే అంశంపై అధికారులు నోరు విప్పడం లేదు. ఇప్పటి వరకు రూ. 234 కోట్లను చెల్లించామని, మిగతా డబ్బులను కూడా కొద్దిరోజుల్లోనే చెల్లిస్తామంటూ సంబంధిత అధికారులు వెల్లడిస్తున్నప్పటికీ రైతులకు మా త్రం ఆ మాటలపై నమ్మకం నెలకొనడం లేదంటున్నారు.
మొత్తం 182 కొనుగోలు కేంద్రాల్లో
కాగా జిల్లావ్యాప్తంగా 182 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కొనుగోలు కేంద్రాల ద్వారా 28,382 మంది రైతుల నుంచి 1,19,719 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఇందులో నుంచి డీఆర్డీఏకు సంబంధించిన 32 కొనుగోలు కేంద్రాల్లో 14,319 యంటీఎస్లు, పీఎసీఎస్ కింద ఏర్పాటు చేసిన 85 కొనుగోలు కేంద్రాల్లో 51,488 యంటీఎస్లు, డీసీయంయస్ పరిధిలోని 61 కొనుగోలు కేంద్రాల్లో 52,792 ఎంటీఎస్ల ధాన్యాన్ని అధికారులు కొనుగోలు చేశారు. దీంతో పాటు జీసీసీ ద్వారా ఏర్పాటు చేసిన 4 సెంటర్లలో 1118 ఎంటీఎస్ల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. అయితే ఈ కొనుగోలు కేంద్రాల్లో కోతలపైనా రైతులు చాలా సందర్భాల్లో ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా ఆందోళనలకు దిగిన సందర్భాలు సైతం ఉన్నాయి. క్షేత్రస్థాయిలో ఎదురైన అన్ని ఇబ్బందులను అధిగమిస్తూ అధికారులు మాత్రం హడావిడిగా కొనుగోలు ప్రక్రియను పూర్తి చేసి చెల్లింపుల అంశంపై ప్రస్తుతం పెద్దగా దృష్టి సారించడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
చెల్లించాల్సింది రూ. 82 కోట్లు
రైతులకు దాదాపు రూ. 82 కోట్లను ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. ఈ డబ్బుల కోసం 8882 మంది రైతులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. రైతులకు మాత్రం పూర్తిస్థాయిలో డబ్బులు అందకపోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మొదటి నుంచి సమస్యలే
ధాన్యం కొనుగోలు ప్రక్రియను మొదటి నుంచి సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. గతానికి భిన్నంగా ఈ సారి కొనుగోలు కేంద్రాలు దాదా పు రెండు నెలల ఆలస్యంగా ప్రారంభించారు. ప్రభుత్వం మొదట్లో కొనుగోలు కేంద్రాల ఏర్పాటు విషయమై ఎక్కడా కూడా స్పష్టతనివ్వలేదు. కేంద్రప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయబోమని ప్రకటించడంతో గందరగోళం ఏర్పడింది. ప్రభుత్వం సైతం కొనుగోలు ప్రక్రియకు సంబంధించి కేంద్రంపైనే ఆధారపడడంతో రైతులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అయితే రైతుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత రావడంతో పాటు వారు క్రమంగా ఆందోళన భాట పట్టడంతో ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉప సంహరించుకొని కొనుగోలు ప్రక్రియకు షరతులు విధించింది. దీంతో సాధారణ రైతాంగం తీవ్ర ఆందోళనకు గురైంది. ఎట్టకేలకు ప్రభుత్వం జిల్లావ్యాప్తంగా 182 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ ప్రక్రియను ముందుకు నడిపించింది. రైస్మిల్లర్ల అభ్యంతరాలను సైతం పక్క న పెట్టి కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం తరలించింది. మరోవైపు ప్రకృతి కూడా అన్నదాతను తీవ్రఇక్కట్లకు గురి చేసింది. ఇలా అనేక సమస్యలను అధిగమించి కొనుగోలు ప్రక్రియను పూర్తి చేసినప్పటికి సంబంధిత అధికారులు ధాన్యం డబ్బుల చెల్లింపుల విషయంలో నాన్చివేత ధోరణి అవలంభిస్తుండడం పట్ల రైతాంగంలో అసం తృప్తి నెలకొంటోందంటున్నారు.
వడ్ల పైసలు రాక చాలా ఇబ్బంది అవుతుంది
వడ్లు అమ్మి 20 రోజులు అవుతున్నా చేతికి డబ్బు లు మాత్రం అందలేదు. డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలియడం లేదు. అధికారులు పట్టించుకుని తొందరగా డబ్బులు వచ్చేలా చూడాలి.
అరుగుల గంగన్న, రైతు, గ్రామం బొప్పారం, మండలం సోన్
70 శాతం మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశాం
ఈ విషయమై జిల్లా అడిషన ల్ కలెక్టర్ రాంబాబును సంప్రదించగా కొంత మంది రైతులకు ధాన్యం డబ్బులు రాని మాట వాస్తమే అన్నారు. కానీ ఇప్పటి వరకు 70 శాతం మంది రైతుల ఖాతాల్లో డబ్బులు వేశా మన్నారు. మిగతా 30 శాతం మంది రైతులకు డబ్బులు రావాల్సి ఉంద న్నారు. మిగతా డబ్బులు కూడా ఒకటి రెండు రోజుల్లో రైతుల ఖాతాల్లో డబ్బుల జమ చేయడం జరుగుతుందని ఆయన వివరించారు.
- రాంబాబు, జిల్లా అడిషనల్ కలెక్టర్
డబ్బులు రాక ఇబ్బందులు పడుతున్నాం
డబ్బులు రాక చాలా ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు ధాన్యం డబ్బులు అ మ్మి నెలలు గడుస్తున్నప్పటికీ డబ్బులు రావటం లే దు. వ్యవసాయం కోసం, ఇంటి అవసరాల కోసం బయట అప్పులు చే యాల్సిన పరిస్థితి నెలకొంది. పిల్లలకు స్కూల్ ఫీజు కడదామంటే జేబుల పైసలు లేవు. అధికారులు రైతుల బాధలు అర్థం చేసుకొని వెంటనే డ బ్బులు జమ అయ్యేలా చూడాలి.