భర్త భారత్లో చిక్కుకుపోవడంతో.. ఇద్దరు కూతుళ్లతో షార్జాలో భార్య ఇక్కట్లు...
ABN , First Publish Date - 2020-05-29T20:17:11+05:30 IST
స్వదేశానికి వెళ్లిన భర్త కరోనా లాక్డౌన్ వల్ల విమానాల రాకపోకలు నిలిచిపోవడంతో ఇండియాలోనే ఇరుక్కుపోయాడు. దీంతో దేశం కాని దేశంలో భార్య, ఇద్దరూ కూతుళ్లు పడరాని పాట్లు పడుతున్నారు.
షార్జా: స్వదేశానికి వెళ్లిన భర్త కరోనా లాక్డౌన్ వల్ల విమానాల రాకపోకలు నిలిచిపోవడంతో ఇండియాలోనే ఇరుక్కుపోయాడు. దీంతో దేశం కాని దేశంలో భార్య, ఇద్దరూ కూతుళ్లు పడరాని పాట్లు పడుతున్నారు. నాలుగు రోజుల్లో వస్తానన్న భర్త.. కాస్తా రెండు నెలలు గడిచిన తిరిగి రాలేదు. చేతిలో ఉన్న డబ్బులు, ఇంట్లో ఉన్న సరుకులు కూడా అయిపోవడంతో పూట గడవడం కూడా కష్టమైపోయింది. ఇది షార్జాలో ఓ ఇండియన్ ఫ్యామిలీ పడుతున్న అవస్తలు. సెఫాలి పానిగ్రాహి అనే భారత మహిళ, తన ఇద్దరూ కూతుళ్లతో కలిసి షార్జాలోని అల్ నహ్దా ప్రాంతంలో ఉంటోంది. మార్చి 15న ఆమె భర్త వ్యక్తిగత పనులపై స్వదేశానికి వచ్చాడు. నాలుగు రోజుల్లో తిరిగి షార్జా వెళ్లాల్సింది. కానీ పనులు ఆలస్యం కావడంతో ఇంకొన్ని రోజులు ఇక్కడే ఉండాల్సి వచ్చింది.
అంతలోనే కరోనా నేపథ్యంలో భారత్లో లాక్డౌన్ విధించారు. విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో అతను ఇక్కడే ఇరుక్కుపోయాడు. ఇక ఇద్దరు కూతుళ్లతో షార్జాలో ఉన్న సెఫాలి పరిస్థితి అగమ్యగోచరంగా మారిపోయింది. నాలుగు రోజుల్లో వస్తానని.. రోజువారి ఖర్చుల కోసం కొంత మొత్తం ఇచ్చి వెళ్లిన భర్త ఇండియాలోనే ఉండిపోయాడు. ఇంట్లో ఉన్న సరుకులు అయిపోయాయి. చేతిలో చిల్లిగవ్వలేదు. దీంతో పూట గడవడం కూడా కష్టంగా ఉందని ఆమె వాపోతోంది. ఇది చాలదన్నట్లు చిన్న కూతురు స్కూల్ ఫీజుల కోసం ఫోన్లు రావడం ఆమెను మరింత కలవరపరుస్తోంది. కాగా, విదేశాల్లో చిక్కుకున్న యూఏఈ రెసిడెంట్స్ను జూన్ 1 నుంచి స్వదేశానికి తిరిగి వచ్చే అవకాశం కల్పించడంతో సెఫానికి కొంత ఊరట లభించింది. కాగా, తన భర్త షూగర్ పేషెంట్ అని, అస్థమా కూడా ఉన్నట్లు ఆమె పేర్కొంది. అతను వాడే మెడిసిన్స్ స్థానికంగా దొరకడం కష్టం. అందుకే ఆయన ఆరోగ్యం విషయమై తాము ఆందోళన చెందుతున్నట్లు సెఫాని తెలిపింది.