హోంమంత్రిగా ఇంకో మహిళ మారడం తప్ప.. మహిళలకు ఒరిగిందేమి లేదు: సుజాత

ABN , First Publish Date - 2022-04-24T21:19:21+05:30 IST

హోంమంత్రిగా ఇంకో మహిళ మారడం తప్ప.. మహిళలకు ఒరిగిందేమి లేదు: సుజాత

హోంమంత్రిగా ఇంకో మహిళ మారడం తప్ప.. మహిళలకు ఒరిగిందేమి లేదు: సుజాత

జంగారెడ్డిగూడెం, ఏలూరు జిల్లా: వైసీపీ ప్రభుత్వంలో మహిళలకు మంత్రి పదవులు తప్ప.. మహిళల రక్షణకు తీసుకున్న చర్యలు శూన్యమని టీడీపీ మాజీ మంత్రి పీతల సుజాత విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజురోజుకు మహిళలపై హత్యాచారాలు పెరుగుతున్నా వైసీపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు శూన్యమని, దిక్కులేని దిశ చట్టం పేరు చెప్పి మహిళలను మృగాళ్లకు బలిచేస్తున్నారని ఆమె మండిపడ్డారు.


హోంమంత్రిగా ఇంకో మహిళా మారడం తప్ప.. మహిళలకు ఒరిగింది ఏమి లేదన్నారు. విజయవాడలోమానసిక దివ్యాంగురాలిని ప్రభుత్వ ఆసుపత్రిలో బంధించి హత్యాచారం చేశారంటే మహిళల పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. గతంలో ముఖ్యమంత్రి నివాసం ఉండే ప్రాంతంలో మహిళపై హత్యాచారం జరిగినా ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించిందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.


వైసీపీ ప్రభుత్వానికి మహిళలంటే ఎందుకింత చులకనా? అని ప్రశ్నించారు. గత టీడీపీ ప్రభుత్వంలో మహిళల వంక చూడాలంటేనే భయపడే పరిస్థితి నుంచి నేడు మహిళలపై హత్యాచారాలు చేసి పోలీసు స్టేషన్ దగ్గరనే వదిలేసే పరిస్థితి వచ్చిందంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక ఆటవిక రాజ్యంలో ఉన్నామో అర్థంకాని పరిస్థితి నెలకొందన్నారు. మహిళలపై దాడులు జరిగితే ప్రతిపక్షం పోరాటం చేస్తే ఆడవాళ్ల శీలానికి విలువ కట్టి పరిహారం ఇచ్చి చేతులు దులుపుకోవడం తప్ప నిందితులపై చర్యలు తీసుకోవడం లేదని పీతల సుజాత ఆగ్రహం వ్యక్తం చేశారు.


బాధితులు ఫిర్యాదులు చేస్తున్నా పోలీసులు కూడా పట్టించుకోకుండా ఉదాసీనంగా వ్యవహరిస్తూ వైసీపీ నాయకుల మాఫీయాలకు రక్షణగా నిలుస్తున్నారని, బాధితుల పక్షాన నిలబడటం లేదని ఆమె మండిపడ్డారు. మహిళా కమిషన్ వాసిరెడ్డి పద్మని మహిళలపై దాడులు విషయంలో ప్రశ్నించినందుకు ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు, బొండా ఉమాకు నోటీసులు పంపారని, మహిళా కమిషన్ నోటీసులు పంపాల్సింది మహిళలకు అండగా నిలబడి పోరాడుతున్న టీడీపీ నాయకులకు కాదని, నిందితులపై చర్యలు తీసుకోని పోలీసులకు పంపి బాధితులకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు.


మహిళా కమిషన్ వాసిరెడ్డి పద్మను ప్రశ్నించినందుకే గౌరవానికి భంగం కలిగితే.. మృగాళ్ల చేతిలో బలైన మహిళల ఆత్మగౌరవానికి భంగం కలగడం లేదా? అని పీతల సుజాత ప్రశ్నించారు. వాసిరెడ్డి పద్మ బాధ్యతయుతమైన కమిషన్ పదవిలో ఉండి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని సంతృప్తి పరచడం కోసం కాకుండా.. మహిళలకు సంతోషం కలిగేలా పనిచేయాలని జంగారెడ్డిగూడెంలో మాజీ మంత్రి పీతల సుజాత డిమాండ్ చేశారు.

Updated Date - 2022-04-24T21:19:21+05:30 IST