గుప్త నిధుల తవ్వకాలు.. 4 శవాలు

ABN , First Publish Date - 2020-08-15T09:52:11+05:30 IST

ఆ ఇంట్లో ఉంటున్న నలుగురూ నురగలు కక్కుకొని చనిపోయారు! హాల్లో ఒకరు....

గుప్త నిధుల తవ్వకాలు.. 4 శవాలు

ఇంటి వెనకాల తవ్విన కుటుంబ సభ్యులు.. భార్యాభర్తలు, కూతురు, అత్త అనుమానాస్పద మృతి

నురగలు కక్కిన స్థితిలో వేర్వేరు చోట్ల మృతదేహాలు

నలుగురూ విష ప్రభావంతోనే.. తేల్చిన పోస్టుమార్టం నివేదిక 

హత్యా.. ఆత్మహత్యా?..ఫోరెన్సిక్‌ నివేదిక వస్తేనే తేలేది


వనపర్తి, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): ఆ ఇంట్లో ఉంటున్న నలుగురూ నురగలు కక్కుకొని చనిపోయారు! హాల్లో ఒకరు.. వంటగదిలో ఒకరు.. పడక గదిలో ఒకరు.. ఇంటి వెనకాల ఒకరు ఇలా అంతా వేర్వేరుచోట్ల విగతజీవులుగా కనిపించారు. మృతదేహాల వద్ద జుట్టు లేని కొబ్బరికాయలు ఉన్నాయి. ఇంటి వెనకాల పడివున్న మృతదేహం వద్ద నిమ్మకాయలు, పువ్వులు ఉన్నాయి. పక్కన తవ్విన ఓ గుంతలో పార పడివుంది! పూజ సామగ్రి, కొబ్బరికాయలు, తవ్విన గొయ్యి ఆధారంగా గుప్త నిధుల కోసం ప్రయత్నాలు జరిగాయని తెలుస్తూనే ఉంది. మృతులు.. భార్యాభర్తలు, వారి కూతురు, అత్త (భార్య తల్లి)! వనపర్తి జిల్లా రేపల్లి మండలం నాగాపూర్‌ గ్రామంలో శుక్రవారం ఉదయం ఈ ఘటన వెలుగుచూసింది. మృతులను ఖాజాపాష (42), ఆయన భార్య ఆస్మ (38), వారి కూతురు ఆష్రిన్‌ (11), ఆస్మ తల్లి హజీరా బేగం (60)గా గుర్తించారు. నలుగురూ విష ప్రభావంతోనే ప్రాణాలు కోల్పోయారని పోస్టుమార్టం నివేదిక తేల్చింది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన హజీరాబేగం, రహీం దంపతులకు ముగ్గురు కూతుళ్లు, కుమారుడు కరీంపాష ఉన్నారు. ఆర్‌ఎంపీ వైద్యుడిగా యునానీ మందులు ఇచ్చే రహీం కొన్నేళ్ల క్రితం అకస్మాత్తుగా చనిపోయాడు. అప్పటికే ముగ్గురు కూతుళ్ల పెళ్లిళ్లు అయ్యాయి. ఇద్దరు కూతుళ్లు నాగర్‌కర్నూలులో, చిన్నకూతురు హైదరాబాద్‌లో ఉం టున్నారు. కుమారుడు కరీంపాష, నాగర్‌కర్నూలులోనే ఆర్‌ఎంపీగా పనిచేస్తున్నాడు. అయితే, తన ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయంటూ దేవుడు కలలోకి వచ్చి చెప్పాడంటూ ఆరేళ్ల క్రితం తన కూతుళ్లు, అల్లుళ్లకు హజీరాబేగం చెప్పింది.


అయితే ఇంట్లో ఎలాంటి తవ్వకాలు చేపటొద్దని కుటుంబసభ్యులు, బంధువులు గట్టి గా చెప్పడంతో ఆ ఆలోచనను ఆమె విరమించుకుంది. రెండో కూతురు ఆస్మ, అల్లుడు ఖాజాపాషా మాత్రం నిధులు దొరికితే పేదరికం నుంచి బయటపడి మంచిగా బతకొచ్చని ఆశపడ్డారు. 


ఏం జరిగింది? 

ఇంట్లో గుప్త నిధుల తవ్వకాలకు గురువారం ముహూర్తం పెట్టుకున్నారు. బుధవారం భార్య ఆస్మ, కూతురు ఆష్రిన్‌తో కలిసి ఖాజాపాషా నాగర్‌కర్నూలు నుంచి నాగపూర్‌లోని అత్తగారి ఇంటికి చేరుకున్నాడు. అప్పటి నుంచి ఫోన్లు స్విచాఫ్‌ చేసుకున్నారు. శుక్రవారం యూసుఫ్‌ అనే వారి బంధువు ఇంటికి వెళ్లగా అక్కడ నలుగురూ విగతజీవులుగా కనిపించారు. హాల్లో ఆస్మ, వంటగదిలో హజీరా, పడకగదిలో ఆష్రిన్‌ మృతదేహాలు కనిపించాయి. ఇంటి వెనకాల తవ్విన గుంత వద్ద ఖాజాపాషా మృతదేహం పడివుంది.  ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. మృతదేహాలను రేపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం జరిపించారు. ఆ నివేదికలో మృతదేహాల్లో విషం ఆనవాళ్లు ఉన్నాయని వైద్యులు పేర్కొన్నారు. అయితే వారు తమకు తామే విషం తీసుకున్నారా? బలవంతంగా ఎవరైనా తాగించారా? అనేది ఫోరెన్సిక్‌ నివేదికలో తేలుతుందని పోలీసులు తెలిపారు. 


ఆ ఇంట్లో..

ప్రస్తుతం ఉంటున్న ఇంటిని హజీరాబేగం దంపతులు ఏళ్ల క్రితమే కొన్నారు. అంతకుముందే ఆ ఇంట్లో ఉంటున్నవారిలో ఇద్దరు ప్రమాదాల్లో చనిపోయారు. హజీరా భర్త రహీం ఎలాంటి అనారోగ్యం లేకుండానే అకస్మాత్తుగా చనిపోయాడు. కొన్నాళ్లకు మనుమడు (కరీంపాష కొడుకు) నీటి సంపులో పడి చనిపోయాడు. తాజాగా ఇంట్లో ఉన్న నలుగురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో గ్రామస్థులంతా ఆ ఇంటి గురించే మాట్లాడుకుంటున్నారు.

Updated Date - 2020-08-15T09:52:11+05:30 IST