జూపార్క్ పరిస్థితిని పరిశీలించిన అధికారులు
ABN , First Publish Date - 2020-10-24T09:08:01+05:30 IST
అధిక వర్షాల వల్ల జూపార్కులో నెలకొన్న పరిస్థితులను ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఆర్.శోభ ఇతర ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించారు.
మదీన, అక్టోబర్ 23 (ఆంధ్రజ్యోతి): అధిక వర్షాల వల్ల జూపార్కులో నెలకొన్న పరిస్థితులను ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఆర్.శోభ ఇతర ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించారు. మీరాలం చెరువు నుంచి జూపార్కులోకి ప్రవేశిస్తున్న వరద నీటిని పరిశీలించారు. జూపార్కులోని సింగోజి పాండ్, ఎలుగుబంటి ఏరియా, సఫారీ పార్కుల్లో వరద నీటిని బయటకు పంపించేందుకు చేసిన ఏర్పాట్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవల కూలిన ప్రహరీ, వంతెన ప్రాంతాలను చూశారు. వరదల కారణంగా జంతువులకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. మీరాలం చెరువు నుంచి వరద నీరు రాకుండా శాశ్వత చర్యలు తీసుకోవడానికి ఇరిగేషన్, జీహెచ్ఎంసీ అధికారులతో చర్చిస్తానని ఆర్.శోభ తెలిపారు. కార్యక్రమంలో జూపార్కు డైరెక్టర్ డాక్టర్ సిధానంద్ కుక్రెట్టి, క్యూరేటర్ ఎన్.క్షితిజ, డిప్యూటీ క్యూరేటర్ ఎ.నాగమణి తదితరులు పాల్గొన్నారు.