ఆత్మకూరు రెవెన్యూ డివిజన్‌ను యధాతథంగా ఉంచాలి : బొమ్మిరెడ్డి

ABN , First Publish Date - 2021-01-14T04:56:49+05:30 IST

మెట్ట ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోకరంగా ఉన్న ఆత్మకూరు రెవెన్యూ డివిజన్‌ను నూతన జిల్లాల ఏర్పాటు క్రమంలో ఎత్తివేస్తారన్న వార్తలను టీడీపీ నాయకుడు, జడ్పీ మాజీ చైర్మన్‌ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి తీవ్రంగా ఖండించారు.

ఆత్మకూరు రెవెన్యూ డివిజన్‌ను యధాతథంగా ఉంచాలి : బొమ్మిరెడ్డి
విలేకరులతో మాట్లాడుతున్న బొమ్మిరెడ్డి

ఆత్మకూరు, జనవరి 13: మెట్ట ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోకరంగా ఉన్న ఆత్మకూరు రెవెన్యూ డివిజన్‌ను నూతన జిల్లాల ఏర్పాటు క్రమంలో ఎత్తివేస్తారన్న వార్తలను టీడీపీ నాయకుడు, జడ్పీ మాజీ చైర్మన్‌ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి తీవ్రంగా ఖండించారు. బుధవారం ఆయన ఆత్మకూరు పట్టణంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆత్మకూరు రెవెన్యూ డివిజన్‌ను యధాతథంగా ఉంచకపోతే ప్రజా పోరాటం తప్పదని హెచ్చరించారు. గతంలో కావలి, నెల్లూరులో ఉన్న రెవెన్యూ డివిజన్‌లకు పనుల నిమిత్తం వెళ్లే ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉండేదన్నారు. మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కృషి వల్ల ఆత్మకూరు పట్టణంలో ఏర్పాటైన రెవెన్యూ డివిజన్‌ ఆత్మకూరు నియోజకవర్గంలోని ఆరు మండలాలు, మరోవైపు ఉదయగిరి నియోజకవర్గంలో మూడు మండలాల ప్రజలకు ఎంతో అందుబాటులో ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నూతన జిల్లాలను ఏర్పాటు చేయడం తమకు అభ్యంతరం లేదని, కానీ ఆత్మకూరు రెవెన్యూ డివిజన్‌ ఎత్తివేస్తే ఉద్యమాలు తప్పవని పేర్కొన్నారు. త్వరలో ప్రజాసంఘాలతో దీనిపై చర్చించి కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. ఆత్మకూరు ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతంరెడ్డి ఆత్మకూరు రెవెన్యూ డివిజన్‌ను యథావిధిగా ఉంచేలా చర్యలు చేపట్టాలన్నారు. నియోజకవర్గంలో రోడ్లు ఆధ్వానంగా ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బొమ్మిరెడ్డి తారక్‌నాథ్‌రెడ్డి, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ తుమ్మల చంద్రారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి కేతా విజయభాస్కర్‌రెడ్డి, పిడికిటి వెంకటేశ్వర్లనాయుడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-14T04:56:49+05:30 IST