డైవర్షన్ పాలిటిక్స్కు బ్రాండ్ అంబాసిడర్గా వైసీపీ
ABN , First Publish Date - 2022-01-29T05:36:12+05:30 IST
వైసీపీ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్కి బ్రాండ్ అంబాసిడర్గా తయారైందని టీడీపీ సీనియర్ నేత జీవీ ఆంజనేయులు విమర్శించారు.
జీవీ ఆంజనేయులు
గుంటూరు, జనవరి 28(ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్కి బ్రాండ్ అంబాసిడర్గా తయారైందని టీడీపీ సీనియర్ నేత జీవీ ఆంజనేయులు విమర్శించారు. శుక్రవారం ఆయన ఆన్లైన్లో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఉద్యోగుల సమస్యల్ని పక్కదారి పట్టించడానికే వైసీపీ జిల్లాల విభజన పేరుతో రాజకీయాలు మొదలు పెట్టిందన్నారు. ఒక శాస్ర్తీయ పద్ధతి లేకుండా ఇష్టారాజ్యంగా జిల్లా కేంద్రాలను నిర్ణయించారని మండిపడ్డారు. జిల్లాలకు పేర్లు పెట్టి కులాల మధ్య చిచ్చుపెట్టటం దుర్మార్గమన్నారు. జిల్లా కేంద్రం సెంటర్గా ఉండాలని చెప్తున్న వైసీపీ పెద్దలు రాష్ట్రానికి కేంద్రంగా ఉన్న అమరావతిని ఎందుకు వ్యతిరేకిస్తున్నారని నిలదీశారు. రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని, ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వడానికి నిధులు లేవంటున్న ప్రభుత్వం కొత్త జిల్లాల మౌలిక వసతుల కల్పనకు నిధులు ఏవిధంగా సమకూరుస్తారని ప్రశ్నించారు. ఒక్కో కొత్త జిల్లా ఏర్పాటుకు దాదాపు రూ.300 కోట్ల నుంచి రూ.400 కోట్లు ఖర్చు అవుతుందని అన్నారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లాలు ఏర్పాటు చేయాలని జీవీ ఆంజనేయులు అన్నారు.