ప్రజలను దోచుకుంటున్న జగన్రెడ్డి
ABN , First Publish Date - 2022-07-02T05:25:16+05:30 IST
వైసీపీ మూడేళ్ల కాలంలో ఆర్టీసీ చార్జీలు రెండుసార్లు పెంచి సామాన్య ప్రజలపై అదనపు భారాన్ని మోపి జగన్రెడ్డి దోచుకుంటున్నాడని పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు విమర్శించారు.
టీడీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు
వినుకొండ, జూలై 1: వైసీపీ మూడేళ్ల కాలంలో ఆర్టీసీ చార్జీలు రెండుసార్లు పెంచి సామాన్య ప్రజలపై అదనపు భారాన్ని మోపి జగన్రెడ్డి దోచుకుంటున్నాడని పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు విమర్శించారు. శుక్రవారం వినుకొండలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజాసేవకు పరిమితమైన ఆర్టీసీ సంస్థ నేడు ప్రజల జేబులకు చిల్లులు పెట్టి దోచుకునే సంస్థగా ఈ దౌర్భాగ్య ప్రభుత్వం మార్చడం దుర్మార్గమన్నారు. ఆర్టీసీ చార్జీల పెంపుతో రూ.2175కోట్లు ప్రజలపై అదనపు భారం మోపారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తానని హామీ ఇచ్చిన జగన్మోహన్రెడ్డి ఉద్యోగులను మాత్రమే ప్రభుత్వంలోకి తీసుకోవడంతో గత సదుపాయాలు కార్మికులకు దూరమవడంతో అవస్థలకు గురవుతున్నారన్నారు. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను మోసం చేస్తుందని, కార్మిక బకాయిలు కూడా చెల్లించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉండటం సిగ్గుచేటన్నారు. పెన్షన్ విధానంపై స్పష్టత లేదని, రివైజ్డ్ పెన్షన్ పథకం అమలు చేయాలని కార్మిక సంఘ నాయకులు కోరుతున్నా సీఎం పట్టనట్లు వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. ఆర్టీసీ చార్జీల పేరుతో ఒక వైపు దోపిడీ చేస్తూ మరో వైపు ఆర్టీసీ భూములను కబ్జా చేసేందుకు జగన్రెడ్డి ప్రభుత్వం కుట్రలు పన్నుతుందన్నారు. భూములను 33ఏళ్లు లీజుకు ఇచ్చే కార్యక్రమంలో వైసీపీ నాయకులు ఆర్టీసీ భూములను తక్కువ లీజు మొత్తానికే కాజేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు జీవీ ఆరోపించారు. ఆర్టీసీ కార్మికులకు ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యం అందించేందుకు నిబంధనలు అంగీకరించవని ఆపివేయడం విడ్డూరమన్నారు.