సంక్షేమాన్ని సమాఽధి చేశారు!

ABN , First Publish Date - 2021-07-27T03:19:14+05:30 IST

మండలంలోని బసినేనిపల్లి గ్రామంలో సోమవారం వెయ్యి కుటుంబాలకు టీడీపీ ఆధ్వర్యంలో ఆనందయ్య ఆయుర్వేద మందు ఉచితంగా పంపిణీ చేశారు.

సంక్షేమాన్ని సమాఽధి చేశారు!
మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకటరామారావు

ఉదయగిరి నుంచే పోటీ చేస్తా

మాజీ ఎమ్మెల్యే బొల్లినేని

ఉదయగిరి రూరల్‌, జూలై 26: రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అభివృద్ధిని అటకెక్కించి సంక్షేమాన్ని సమాధి చేసిందని మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకటరామారావు అన్నారు. సోమవారం స్థానిక చెంచలబాబు అతిథిగృహంలో మాజీ జిల్లా పరిషత్‌ చైర్మన్‌ చెంచలబాబుయాదవ్‌ అధ్యక్షతన నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ 2024లో తాను కావలి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుందని, ఇలాంటి వదంతలు నమ్మవద్దన్నారు. 12 ఏళ్లుగా నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలతో తనకు సత్సంబంధాలున్నాయన్నారు. 2019 ఎన్నికల్లో నాయకుల అధిపత్య పోరుతోనే ఓటమి చెందానన్నారు. అవన్ని వదిలి నాయకులంతా ఒకేతాటిపై నడిచి ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటాలు చేయాలన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేశారన్నారు. తాను నియోజకవర్గంలో భాగమైన కలిగిరిలో ఉంటే అప్పుడు కలిగిరికే పరిమితమయ్యారని ఆరోపించారని, ప్రస్తుత ఎమ్మెల్యే నియోజకవర్గం కాని మర్రిపాడులో ఉంటూ ప్రజలను పట్టించుకోవడంలేదన్నారు. తన ఐదేళ్ల పాలనలో ఏ ఒక్కరిపై కేసులు పెట్టి వేధించలేదని, నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి వైదొలుగుతానన్నారు. ప్రస్తుతం అన్యాయాలు, అక్రమాలను ప్రశ్నిస్తే కేసులు బనాయిస్తున్నారన్నారు. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితిని చూసి ప్రజలు ప్రభుత్వ పాలనపై దుమ్మెత్తిపోస్తున్నారన్నారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతుందని, రివర్స్‌ టెండరింగ్‌ కమీషన్ల కోసమేనని ధ్వజమెత్తారు. 2024లో చంద్రబాబు సారధ్యంలో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని, తమ కార్యకర్తలను ఇబ్బంది పెట్టేవారికి వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు. కోడిగుడ్లు, మాంసంతోపాటు భూమి కొన్నా, అమ్మినా లంచం ఇచ్చుకోవాల్సిన దుస్థితి ప్రస్తుత ప్రభుత్వంలో నెలకొందన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకుడు పమిడి రవికుమార్‌చౌదరి, మండల టీడీపీ కన్వీనర్‌ బయ్యన్న, నాయకులు గడ్డం వెంకటేశ్వర్లు, బొజ్జా నరసింహులు, వెంకటస్వామి, నల్లిపోగు రాజా,  సందానీ, చండ్ర మధుసూదన్‌రావు, వెంకయ్య, షరీప్‌, కాకి ప్రసాద్‌, రామారావు, అన్ని మండలాల టీడీపీ కన్వీనర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 

టీడీపీ ఆధ్వర్యంలో ఆనందయ్య మందు పంపిణీ

సీతారామపురం, జూలై 26 : మండలంలోని బసినేనిపల్లి గ్రామంలో సోమవారం వెయ్యి కుటుంబాలకు టీడీపీ ఆధ్వర్యంలో ఆనందయ్య ఆయుర్వేద మందు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకటరామారావు మాట్లాడుతూ కరోనా నివారణకు ఆనందయ్య ఆయుర్వేద మందు ఎంతగానో దోహదపడుతుందన్నారు. ఇలాంటి ఆయుర్వేద మందుకు ప్రభుత్వం పూర్తిస్ధాయిలో సహకరించకపోవడం శోచనీయమన్నారు. ఏది ఏమైనా గ్రామంలోని ప్రజలంతా ఆనందయ్య మందు వేసుకుని కరోనా బారిన పడకుండా జాగ్రత్తపడాలన్నారు. గ్రామ ప్రజల సంక్షేమం కోసం ఆనందయ్య మందును సేకరించిన మండల టీడీపీ నాయకులు ప్రభాకర్‌రాజు, వినయ్‌కుమార్‌లను అభినందించారు. త్వరలో మండలంలోని అన్ని గ్రామాల ప్రజలకు ఆనందయ్య మందును అందించేందుకు ప్రణాళికలను రూపొందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పమిడి రవికుమార్‌ చౌదరి, చెంచలబాబుయాదవ్‌, జిల్లా తెలుగు యువత నాయకుడు మూలె రఘురామిరెడ్డి, మండల టీడీపీ కన్వీనర్‌ కప్పా ప్రభాకర్‌రాజు, జయరామిరెడ్డి, బీసీ సెల్‌ నాయకుడు తురకా వెంకటేశ్వర్లు, వినయ్‌కుమార్‌, స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-27T03:19:14+05:30 IST