MR Sitaram: లౌకికత్వమే దేశానికి బలమైన పునాది
ABN , First Publish Date - 2022-08-16T17:59:43+05:30 IST
లౌకికత్వం అనే పునాదులపైనే భవ్య భారత ఉజ్వల భవిష్యత్తు ఆధారపడి ఉందని గోకుల ఎడ్యుకేషన్ ట్రస్టు ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి డా
- ఆర్ఐటీ వేడుకల్లో డాక్టర్ ఎంఆర్ సీతారాం
బెంగళూరు, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): లౌకికత్వం అనే పునాదులపైనే భవ్య భారత ఉజ్వల భవిష్యత్తు ఆధారపడి ఉందని గోకుల ఎడ్యుకేషన్ ట్రస్టు ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి డాక్టర్ ఎంఆర్ సీతారాం(Dr. MR Sitaram) పేర్కొన్నారు. రామయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టక్నాలజీ క్యాంప్సలో ఆజాదీ కా అమృత మహోత్సవాల సందర్భంగా సోమవారం ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుదీర్ఘ పోరాటంతో దక్కిన స్వతంత్ర భారతదేశంలో దశాబ్దకాలంగా అసహనం పెరుతున్న వైనంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. భరతమాత ముద్దుబిడ్డలుగా ఉన్నందుకు మనమంతా గర్విద్దామని, దేశసేవకు పునరంకితమవుదామని ఆయన పిలుపునిచ్చారు. ప్రజలంతా దేశానికి విధేయులుగా ఉంటూ కులమత భాషలకు అతీతంగా భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటి చెప్పాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు. రాజ్యాంగాన్ని గౌరవిస్తూ పరస్పరం సహకరించుకుంటూ ప్రపంచ చిత్రపటం(picture)లో భారత్ను బలీయమైన శక్తిగా తీర్చిదిద్దడంతో ప్రజలంతా కీలక పాత్ర పోషించాలని ఆయన అభిలషించారు. నేటి తరానికి అలనాటి అద్భుత స్వాతంత్య్ర పోరాటాలను తెలిజేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. అంతకుముందు ఆర్ఐటీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్వీఆర్ నాయుడు స్వాగతం పలుకుతూ, దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్న సైనికులను గౌరవించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. జాతీయ, రాష్ట్ర స్థాయిలో వివిధ క్రీడల్లో రాణించిన పలువుర్ని డాక్టర్ ఎంఆర్ సీతారాం పురస్కారాలతో గౌరవించారు. వేదికపై చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ రామచంద్రతో పాటు వివిధ విభాగాల ప్రిన్సిపాల్స్ ఆశీనులయ్యారు. ఇదే సందర్భంగా విద్యార్ధులు సమర్పించిన దేశభక్తి గీతాలు, నృత్యాలు ప్రేక్షకుల్ని విశేషంగా ఆలరించాయి. పెద్ద సంఖ్యలో విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ వేడుకలో పాలుపంచుకున్నారు.