Ex ministerపై మరో అవినీతి కేసు
ABN , First Publish Date - 2022-05-13T12:50:34+05:30 IST
ప్రభుత్వ ఉద్యోగాలిప్పిస్తామంటూ పలువురి నుంచి సుమారు రూ.2 కోట్ల మేర వసూలు చేసి, మోసం చేసిన వ్యవహారంలో అన్నాడీఎంకే నాయకుడు, మాజీ మంత్రి
పెరంబూర్(చెన్నై): ప్రభుత్వ ఉద్యోగాలిప్పిస్తామంటూ పలువురి నుంచి సుమారు రూ.2 కోట్ల మేర వసూలు చేసి, మోసం చేసిన వ్యవహారంలో అన్నాడీఎంకే నాయకుడు, మాజీ మంత్రి రాజేంద్ర బాలాజీపై మరో అవినీతి కేసు నమోదైంది. పలు శాఖల్లో ఉద్యోగాలిప్పిస్తామని నమ్మించిన మాజీ మంత్రి రాజేంద్ర బాలాజీపై మాజీ స్పీకర్ కాళిముత్తు సోదరుడు, వెంబకోట యూనియన్ మాజీ అన్నాడీఎంకే నాయకుడు విజయ నల్లతంబి గత ఏడాది విరుదునగర్ జిల్లా క్రైం విభాగానికి ఫిర్యాదు చేశాడు. ఈ వ్యవహారంపై రాజేంద్ర బాలాజి, ఆయన సహాయకుడు బాబురాజ్, బలరామన్, ముత్తుపాండి తదితరులపె నవంబరు 15న కేసు నమోదైంది. ఈ కేసులో తనకు ముందస్తు బెయిలు మంజూరు చేయాలని రాజేంద్ర బాలాజి పెట్టుఉన్న పిటిషన్ను మద్రాసు హైకోర్టు డిసెంబరు 17న తిరస్కరించడంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దీంతో, ప్రత్యేక బృందాలు ఆయన కోసం గాలించి జనవరి 5న కర్ణాటక రాష్ట్రంలో అరెస్ట్ చేశాయి. ఇదిలా ఉండగా మాజీ మంత్రి రాజేంద్ర బాలాజి ప్రభుత్వ ఉద్యోగాల పేరిట పలువురి నుంచి సుమారు రూ.2 కోట్లు తీసుకున్నట్టు శివగంగకు చెందిన షణ్ముగనాథన్ చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గురువారం ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై కేసు నమోదుచేసి రాజేంద్ర బాలాజిని విచారించనున్నట్లు పోలీసుల సమాచారం.