ntr health university name change: ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్పుపై మాజీమంత్రి మండవ ఆవేదన.. బాధతో జగన్‌కు లేఖ

ABN , First Publish Date - 2022-09-29T01:08:45+05:30 IST

సీఎం జగన్ (cm jagan)కు మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు (Mandava Venkateswara Rao) లేఖ రాశారు.

ntr health university name change: ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్పుపై మాజీమంత్రి మండవ ఆవేదన.. బాధతో జగన్‌కు లేఖ

హైదరాబాద్: సీఎం జగన్ (cm jagan)కు మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు (Mandava Venkateswara Rao) లేఖ రాశారు. ఎన్టీఆర్ (ntr) వర్సిటీ పేరు మార్పుపై మండవ ఆవేదన చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu) హయాంలో పలువురు.. మాజీ సీఎంలకు సముచిత గౌరవం లభించిందని గుర్తుచేశారు. రాష్ట్ర విభజన అనంతరం టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ పేర్లు మార్చలేదన్నారు. ఉద్యమ సందర్భంగా ధ్వంసమైన ప్రముఖుల విగ్రహాలను పునరుద్ధరించారని మండవ వెంకటేశ్వరరావు గుర్తుచేశారు. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టినప్పుడు ఎంతో హర్షించామని తెలిపారు. ఎన్టీఆర్ తెలుగు ప్రజల ఆత్మగౌరవ ప్రతీక అని కొనియాడారు. ఎన్టీఆర్కు ప్రాంతం, మతం, కులం లేవని, పేద ప్రజల అభ్యున్నతే పరమావధిగా చారిత్రక నిర్ణయాలు తీసుకున్న మహోన్నత వ్యక్తి ఎన్టీఆరేనని మండవ వెంకటేశ్వరరావు లేఖలో తెలిపారు. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన డాక్టర్‌ ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరు మార్చాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఎన్టీఆర్‌ పేరు తీసేసి... ‘వైఎస్సార్‌ హెల్త్‌ యూనివర్సిటీ’గా మార్చాలని అసెంబ్లీలో కూడా తీర్మానం చేశారు. అసెంబ్లీ ఆమోదించగానే... డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం కాస్తా, ‘డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం’గా మారింది. 


హెల్త్‌ వర్సిటీ పేరు కథ..

వైద్య విద్యార్థులకు అప్పట్లో ఏపీలో ప్రత్యేక వర్సిటీ లేదు. ప్రస్తుతం ఉన్న ఆంధ్రా యూనివర్సిటీ, ఎస్వీ యూనివర్సిటీ, నాగార్జున యూనివర్సిటీలే వైద్య విద్యార్థులకు గుర్తింపు ఇచ్చేవి. ఈ క్రమంలో అనేక అక్రమాలు జరిగేవి. తగిన పర్యవేక్షణ ఉండేది కాదు. ఆయా వర్సిటీల పేరుతో నకిలీ ఎంబీబీఎస్‌ సర్టిఫికెట్లు కూడా వచ్చాయి. ఈ క్రమంలో.. వైద్య విద్యలో నాణ్యత పెంచి, పర్యవేక్షణ, నియంత్రణ సాధించేందుకు ఒక స్వయంప్రతిపత్తి ఉన్న ప్రత్యేక సంస్థ ఉండాలని ఎన్టీఆర్‌ భావించారు. ప్రత్యేకంగా... హెల్త్‌ వర్సిటీని ఎన్టీఆర్‌ ప్రారంభించారు. అప్పట్లో అన్ని సంస్థలూ హైదరాబాద్‌ కేంద్రంగానే ఏర్పడి పని చేసేవి. కానీ, తెలంగాణతోపాటు ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల వారికీ చేరువలో ఉండేలా... విజయవాడలో హెల్త్‌ వర్సిటీ ఏర్పాటు చేయాలని 1983లో నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత మూడేళ్లకు... 1986 ఏప్రిల్‌లో వర్సిటీ నిర్మాణ పనులు ప్రారంభించారు. అదే ఏడాది నవంబరు 1 నుంచి అడ్మిషన్లు స్వీకరించడం మొదలైంది. అప్పట్లో దీనికి తొలుత పెట్టిన పేరు యునివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌. 1998 ఫిబ్రవరిలో, అంటే ఎన్టీఆర్‌ చనిపోయిన రెండేళ్లకు, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు.. హెల్త్‌ వర్సిటీకి ఎన్టీఆర్‌ పేరు పెట్టాలని ప్రతిపాదించారు.

Updated Date - 2022-09-29T01:08:45+05:30 IST