మాజీమంత్రిపై మరో కేసు నమోదు

ABN , First Publish Date - 2022-03-19T14:00:52+05:30 IST

అన్నాడీఎంకే నాయకుడు, మాజీ మంత్రి డి.జయకుమార్‌పై తిరుచ్చిలోనూ కేసు నమోదైంది. రాజధాని నగరం చెన్నైలో ఇటీవల జరిగిన మున్సిపల్‌ ఎన్నికల సమయంలో

మాజీమంత్రిపై మరో కేసు నమోదు

పెరంబూర్‌(చెన్నై): అన్నాడీఎంకే నాయకుడు, మాజీ మంత్రి డి.జయకుమార్‌పై తిరుచ్చిలోనూ కేసు నమోదైంది. రాజధాని నగరం చెన్నైలో ఇటీవల జరిగిన మున్సిపల్‌ ఎన్నికల సమయంలో దొంగ ఓట్లు వేస్తున్నారంటూ డీఎంకే నేతను అర్ధనగ్నంగా ఊరేగించడం, అనుమతి లేకుండా ఆందోళన చేపట్టడం, భూ ఆక్రమణమణ తదితర కేసుల్లో జయ కుమార్‌ అరెస్టయ్యారు. ఈ కేసుల్లో ఆయనకు బెయిలు మంజూరు చేసిన న్యాయస్థానం, తిరుచ్చిలోనే ఉంటూ, తిరుచ్చి కంటోన్మెంట్‌ పోలీస్‌స్టేషన్‌లో ప్రతిరోజు సంతకం చేయాలని నిబంధన విధించింది. ఈ నేపథ్యంలో, సంతకం చేసేందుకు పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన ఆయన వెంట భారీగా కార్యకర్తలు తరలివచ్చారు. వారిలో కొందరు డీఎంకే ప్రభుత్వం, ముఖ్యమంత్రి స్టాలిన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో, మాజీ మంత్రులు జయకుమార్‌, వెల్లమండి నటరాజన్‌, పరంజ్యోతి, మాజీ ఎంపీ కుమార్‌ సహా పది మందిపై, నిబంధనలకు విరుద్ధంగా ఒకే చోట చేరడం, ప్రజలు, రవాణా ఇబ్బందులు కలిగించడం, కరోనా కాలంలో ప్రజల ప్రాణాలకు ముప్పుతెచ్చేలా వ్యవహరించడం తదితర ఐదు సెక్షన్ల కింద కంటోన్మెంట్‌ పోలీసులు కేసు నమోదుచేశారు. ఈ వ్యవహారంపై జయకుమార్‌ స్పందిస్తూ, పార్టీ నేతలు, ముఖ్య నిర్వాహకులు వచ్చే సమయంలో భారీగా కార్యకర్తలు తరలిరావడం సాధారణ విషయమేనన్నారు. ఉదయనిధి కార్యక్రమాలకు 10 వేల మందికి పైగా తరలివస్తుంటారని, ఆ సమయంలో మాత్రం కరోనా రాదా అని ప్రశ్నించారు.  

Updated Date - 2022-03-19T14:00:52+05:30 IST