Rssతో పెట్టుకోవద్దు
ABN , First Publish Date - 2022-06-05T16:30:55+05:30 IST
ఆర్ఎస్ఎస్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయరాదని, సంస్థతో పెట్టుకోవద్దని ప్రతిపక్షనేత సిద్దరామయ్యకు బీజేపీ మాజీ మంత్రి ఈశ్వరప్ప
- ప్రతిపక్షనేత సిద్దరామయ్యకు మాజీమంత్రి ఈశ్వరప్ప హెచ్చరిక
బెంగళూరు, జూన్ 4 (ఆంధ్రజ్యోతి): ఆర్ఎస్ఎస్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయరాదని, సంస్థతో పెట్టుకోవద్దని ప్రతిపక్షనేత సిద్దరామయ్యకు బీజేపీ మాజీ మంత్రి ఈశ్వరప్ప హెచ్చరించారు. పాఠ్యపుస్తకాలకు సంబంధించి సాగుతున్న వివాదం నేపథ్యంలో ఇటీవల విద్యాశాఖ మంత్రి బీసీ నాగేశ్ ఇంటిని కాంగ్రెస్ అనుబంధమైన ఎన్ఎస్యూఐ కార్యకర్తలు ముట్టడించారు. ఏకంగా నిప్పు పెట్టేందుకు ప్రయత్నించారని కేసు నమోదు చేసిన పోలీసులు పలువురిని అరెస్టు చేశారు. ఇదే విషయమై సిద్దరామయ్య తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రమంతటా ‘నిక్కర్ల’కు నిప్పుపెట్టే పోరాటం చేస్తామని హెచ్చరించారు. సిద్దరామయ్య వ్యాఖ్యలపై మాజీ మంత్రి ఈశ్వరప్ప ట్విట్టర్ ద్వారా ఆగ్రహం వ్యక్తం చేశారు. రావణుడు లంకలో హనుమంతుడి తోకకు నిప్పు పెడితే ఏం జరిగిందో... కాంగ్రెస్ కు అదే పరిస్థితి వస్తుందన్నారు. కాంగ్రెస్ కు నిప్పు పెట్టడమే తెలుసని వ్యంగ్యం చేశారు. ఆర్ఎస్ఎస్ జోలికి రాకండి... హుషార్ అంటూ శనివారం ట్వీట్ చేశారు. మంత్రి ఇంటి వద్ద ఆందోళన చేయడం తప్పు కాదని, గేటు లోపలికి ఎలా వెళతారని, నిప్పు పెట్టేచర్యను ఎవరైనా సమర్థిస్తారా... అంటూ ప్రశ్నించారు. సంఘ విద్రోహక వ్యవహారాలకు పాల్పడేవారిపట్ల ఎంతటివారైనా కఠినంగా వ్యవహరించాల్సిందేనన్నారు.