అమ్మఒడి పథకానికి ఎగనామం
ABN , First Publish Date - 2021-10-18T05:01:45+05:30 IST
ఏ పథకమైనా ప్రజలను ఊరించి ఊసూరు మనిపించడం జగనరెడ్డికే సాధ్యమని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు అన్నారు.
నక్కా ఆనందబాబు
గుంటూరు, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): ఏ పథకమైనా ప్రజలను ఊరించి ఊసూరు మనిపించడం జగనరెడ్డికే సాధ్యమని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు అన్నారు. ఆదివారం ఆయన గుంటూరులోని తన క్యాంపు కార్యాలయం నుంచి ఆనలైనలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. అమ్మఒడి పథకాన్ని ఎగనామం పెట్టేందుకు జగనరెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మొత్తం 84లక్షల మంది విద్యార్థులు ఉంటే ఈ ఏడాది కేవలం 44 లక్షల మందికి మాత్రమే వర్తింపజేస్తూ సంగం మందిని మోసం చేస్తున్నారని వివరించారు. విద్యార్థుల సంఖ్యను కుందించేందుకు వింత ఆంక్షలు విధించారని విమర్శించారు. మొదటి రూ.15వేలు ఇస్తామని హామీ ఇచ్చి దానిని రూ.14వేలకు కుదించారన్నారు. ఈ ఏడాది రూ.14వేలు కాకుండా లాప్ట్యాప్లు ఇస్తున్నామని దానికి 90శాతం మంది తల్లిదండ్రులు ఒప్పుకొన్నారని తప్పుడు ప్రచారం చేసుకున్నారని తెలిపారు. ఇప్పుడు హాజరును సాకుగా చూపిస్తోందన్నారు. గత ప్రభుత్వం ఇస్తున్న ఉపకార వేతనాలు, సైకిళ్లు, విద్యార్థులకు ఉచిత వైద్యం వంటి ఎన్నో కార్యక్రమాలను నిలిపివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం అమ్మఒడిని అటకెక్కించడంతో రాష్ట్రంలో విద్యావ్యవస్థ మరింత అధోగతి పాలైందని ఆనందబాబు అన్నారు.