Former CM: సమష్టి నాయకత్వంలోనే ఎన్నికలకు వెళతాం
ABN , First Publish Date - 2022-08-17T17:22:34+05:30 IST
రానున్న శాసనసభ ఎన్నికలను సమష్టి నాయకత్వంలోనే ఎదుర్కొంటామని మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత బీఎస్
- మాజీ సీఎం యడియూరప్ప స్పష్టీకరణ
బెంగళూరు, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): రానున్న శాసనసభ ఎన్నికలను సమష్టి నాయకత్వంలోనే ఎదుర్కొంటామని మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడియూరప్ప(Former Chief Minister and senior BJP leader BS Yeddyurappa) స్పష్టం చేశారు. నగరంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కంఠీరవ స్టేడియంలో పంద్రాగస్టు వేడుకల సందర్భంగా ఈ మేరకు చేసిన వ్యాఖ్యలను ఆయన గట్టిగా సమర్థించుకున్నారు. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ అరుణ్సింగ్ ఇటీవల చేసిన ప్రకటనకు యడియూరప్ప వ్యాఖ్యలు పూర్తి భిన్నంగా ఉండడం గమనార్హం. యడియూరప్ప మార్గదర్శకత్వంలో సీఎం బొమ్మై నాయకత్వంలో ఎన్నికలకు వెళతామని అరుణ్సింగ్ తేల్చి చెప్పిన సంగతి విదితమే. యడియూరప్ప తాజా వ్యాఖ్యలు బీజేపీ శిబిరంతోపాటు రాష్ట్ర రాజకీయాల్లోనూ తీవ్ర కుతూహలం రేకెత్తిస్తున్నాయి. సమష్టి నాయకత్వంలో అయితేనే తాను క్రియాశీలక పాత్ర పోషిస్తానని ఇటీవల నగరంలో పర్యటించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా(Union Home Minister Amit Shah)కు కూడా యడియూరప్ప ఇదే విషయాన్ని వెల్లడించినట్టు కథనాలు వెలువడిన సంగతి విదితమే. యడియూరప్ప తాజా వ్యాఖ్యలు ఇందుకు మరింత బలం చేకూరుస్తున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు.