O Panneerselvam: ఓపీఎస్కు ఈసీ ఝలక్
ABN , First Publish Date - 2022-07-31T15:01:30+05:30 IST
రాష్ట్ర ఎన్నికల సంఘం అన్నాడీఎంకే బహిష్కృత నేత ఒ. పన్నీర్సెల్వం (O Panneerselvam)కు ఝలక్ ఇచ్చింది. త్వరలో జరుగనున్న
- అఖిలపక్ష సమావేశానికి ఈపీఎస్కు ఆహ్వానం
- పన్నీర్సెల్వానికి రాని పిలుపు
చెన్నై, జూలై 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఎన్నికల సంఘం అన్నాడీఎంకే బహిష్కృత నేత ఒ. పన్నీర్సెల్వం (O Panneerselvam)కు ఝలక్ ఇచ్చింది. త్వరలో జరుగనున్న అఖిలపక్ష(Akhilapaksha) సమావేశానికి ఆయనకు ఆహ్వానం పంపకుండా, అన్నాడీఎంకే తాత్కాలిక అధ్యక్షుడిగా ఎన్నికైన ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్)కి మాత్రం పంపింది. దీంతో ఎన్నికల కమిషన్ కూడా ఈపీఎస్ను పార్టీ అధినేతగా గుర్తించినట్లయింది. ఆగస్టు ఒకటిన నిర్వహించనున్న అఖిలపక్ష సమావేశానికి రావాలంటూ ఎడప్పాడికి ఈపీ ఆహ్వానం పంపింది. ఆ పార్టీ తరఫున పొల్లాచ్చి జయరామన్(Jayaraman), ఇన్బదురై ఈ సమావేశానికి హాజరుకానున్నారు. దేశమంతటా ఓటరు గుర్తింపుకార్డును ఆధార్తో అనుసంధానం చేయడానికి చర్యలు చేపడుతుండటంతో ఈ విషయమై చర్చలు జరిపేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆగస్టు ఒకటిన గుర్తింపు కలిగిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తోంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి సత్యప్రద సాహు అధ్యక్షతన ఆ సమావేశం జరుగనుంది.
నన్ను పిలవండి ప్లీజ్: ఓపీఎస్
అన్నాడీఎంకే ఉపసమన్వయకర్తగా వున్న ఈపీఎస్ను తొలగించి, ఆ స్థానంలో సీనియర్ నేత వైద్యలింగంను నియమించినందున అఖిలపక్ష సమావేశానికి తమనే ఆహ్వానించాలని కోరుతూ ఓపీఎస్(OPS) కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన శనివారం ఈసీకి లేఖ రాశారు. తమ గ్రూపునే అసలైనదిగా గుర్తించి, తమకు ఆహ్వానం పంపాలని అభ్యర్థించారు.