హామీలు నెరవేర్చకపోతే పార్టీ రద్దు

ABN , First Publish Date - 2022-04-29T17:31:10+05:30 IST

మరో ఏడాదిలో జరిగే ఎన్నికలలో జేడీఎస్ కు మద్దతివ్వండి అధికారంలోకి వస్తే ముందుగా ఇచ్చిన హామీలన్నింటీనీ నెరవేరుస్తామన్నారు. లేదంటే ఐదేళ్ళ తర్వాత జేడీఎస్‌

హామీలు నెరవేర్చకపోతే పార్టీ రద్దు

- పటిష్టమైన ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వండి

- ఉచిత విద్య, వైద్యమే మా అజెండా

- తుమకూరులో మాజీ సీఎం కుమారస్వామి


బెంగళూరు: మరో ఏడాదిలో జరిగే ఎన్నికలలో జేడీఎస్ కు మద్దతివ్వండి అధికారంలోకి వస్తే ముందుగా ఇచ్చిన హామీలన్నింటీనీ నెరవేరుస్తామన్నారు. లేదంటే ఐదేళ్ళ తర్వాత జేడీఎస్‌ పార్టీని రాష్ట్రంలో రద్దుచేస్తామని మాజీ సీఎం కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం తుమకూరు జిల్లా హెబ్బూరులో ‘జనతాజలధార’ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలనుద్దేశించి కుమారస్వామి మాట్లాడారు. కొవిడ్‌ సందర్భంలోను మేం చేతులు కట్టుకుని కూర్చోలేదని చేతనైనంత సాయం చేశామన్నారు. ప్రజలకష్టాలలో స్పందించే కార్యక్రమాలు నిరంతరంగా చేస్తున్నామన్నారు. ఒక శిక్ష మరో వైపు వైద్యం, సాగునీటి ప్రాజెక్టులు వంటి పథకాలకు ప్రాధాన్యత నిస్తామన్నారు. ఎల్‌కేజీ నుంచి పీయూసీ దాకా ఉచిత విద్య అందించదలచామన్నారు. ప్రైవేటు విద్యాసంస్థలలో చదివించి తల్లిదండ్రులను అప్పులుపాలు చేయలేమన్నారు. ఉచితంగా ఇంగ్లీషు మీడియం ప్రవేశపెడతామన్నారు. ఉచితంగా వైద్యసేవలు అందిస్తామన్నారు. రాష్ట్రంలోని ఆరువేల గ్రామపంచాయతీలలో వైద్యసేవలు సమకూరుస్తామన్నారు. ప్రతి గ్రామంలోనూ 24గంటల పాటు వైద్యులు అందుబాటులో ఉండి సేవలు అందిస్తామన్నారు. ప్రజలు సంపూర్ణంగా సహకరిస్తే పటిష్టమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా ఆశీస్సులు అందించాలన్నారు. ప్రజలకు ఇచ్చే హామీలు నెరవేర్చకుంటే మరోసారి ఓట్లు అడిగేందుకు వచ్చేది లేదని జేడీఎస్‌ పార్టీను రద్దు చేస్తామని తేల్చిచెప్పారు. జనతాజలధార కార్యక్రమానికి పెద్దఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2022-04-29T17:31:10+05:30 IST