ఐదెకరాల స్థలం ఎక్కడ.. KCR, KTRలకు స్పీడ్ పోస్ట్.. సీఎం పేషీలో పలుసార్లు విజ్ఞప్తులు..!?
ABN , First Publish Date - 2021-11-21T14:54:09+05:30 IST
‘ప్రభుత్వం ఐదెకరాల స్థలం కేటాయించింది. అలాట్మెంట్ లెటర్ను కూడా..
హైదరాబాద్ సిటీ/అడ్డగుట్ట : ‘ప్రభుత్వం ఐదెకరాల స్థలం కేటాయించింది. అలాట్మెంట్ లెటర్ను కూడా ఇచ్చింది. స్థలం అందుబాటులో లేదని జాప్యం చేస్తూ వచ్చింది. సచివాలయ అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది. కలెక్టర్లు మారుతున్నా స్థలం మాత్రం దక్కలేదు’ అని ఓ మాజీ ఎయిర్ఫోర్స్ ఉద్యోగి, తెలంగాణ ఉద్యమ కారుడు ఆవేదన వ్యక్తం చేశాడు. సికింద్రాబాద్ తుకారాంగేట్కు చెందిన కేవీ అశోక్ కుమార్ హైద్రాబాద్ హకీంపేట్లోని ఎయిర్ఫోర్స్లో 30 ఏళ్లుగా పనిచేశాడు. ఇతనికి అప్పటి ప్రభుత్వం ఆదేశాల మేరకు ఐదెకరాలు స్థలం ఇస్తామని ప్రకటించి 2009 మార్చిలో అలాట్మెంట్ లెటర్ ఇచ్చారు. మెదక్ జిల్లా గజ్వేల్ మండ లం కొండ్లపాక గ్రామంలో ఐదెకరాలు కేటాయించినట్లు అందులో స్పష్టం చేశారు. అలాట్మెంట్ లెటర్తో జిల్లా కలెక్టర్ దగ్గరికి వెళితే ఆ గ్రామంలో ఎయిర్ఫోర్స్ మాజీ ఉద్యోగులకు సంబంధించి స్థలం లేదని, సిద్దిపేట పట్టణ శివారులో ఇస్తామని చెప్పారు. నాటినుంచి కాలయాపన చేయడంతో అధికారులు, కలెక్టర్లు మారిపోయారు.
కేసీఆర్ను కలవనివ్వండి సారూ..
తనకు ప్రభుత్వం కేటాయించిన స్థలం ఇప్పటికీ తనకు అందలేదు. స్థలం లేదని బుకాయిస్తూ మాటను దాటవేస్తున్నారు. వృద్ధ వయసులో ఉన్న తనను సీఎం కేసీఆర్ను కలవనివ్వండి అంటూ ప్రాధేయపడుతున్నాడు. 2019-2021 వరకు దాదాపు యాబై సార్లు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్లకు స్పీడ్ పోస్టుల ద్వారా దరఖాస్తు చేసుకున్న. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి కబురు రాలేదు. 1969లో తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తనకు అన్యాయమే జరిగింది. అనేకసార్లు సిద్దిపేట, మెదక్ కలెక్టర్లను ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. న్యాయం చేయాలని కోరుతున్నా. - కేవీ అశోక్ కుమార్