కర్నూలులో పంద్రాగస్టు వేడుకలకు సర్వం సిద్ధం
ABN , First Publish Date - 2022-08-15T04:27:04+05:30 IST
పోలీసు పరేడ్ మైదానంలో 76వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
- పంద్రాగస్టు వేడుకలకు ఏర్పాట్లు పూర్తి
- జాతీయ జెండాను ఆవిష్కరించనున్న మంత్రి బుగ్గన
- దాదాపు 300 మందికి ప్రశంసాపత్రాలు
కర్నూలు(కలెక్టరేట్), ఆగస్టు 13: పోలీసు పరేడ్ మైదానంలో 76వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, నగర ప్రజలు కలెక్టర్, ఎస్పీ ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాట్లు చేశారు. సోమవారం ఉదయం 9.05 గంటలకు పరేడ్ మైదానానికి జిల్లా ఇనచార్జి మంత్రి, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి చేరుకుంటారు. 9.10 గంటల నుంచి 9.14 గంటల మధ్యలో జాతీయ జెండా ఆవిష్కరిస్తారు. 9.15 గంటల స్వాతంత్య్ర దినోత్సవ సందేశం ఇస్తారు. అనంతర గార్డ్ ఆఫ్ ఆనర్, పోలీస్ సాయుధ దళాలు మార్చ్పాస్ట్, స్వాతంత్య్ర సమరయోధులు, ప్రజా ప్రతినిధులకు అభినందనలు తెలియజేస్తారు.నవరత్నాలు మరియు ప్రభుత్వ పథకాలపై వివిధ శాఖల శకటాలు, విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, స్టాల్స్ ప్రదర్శన, ఉత్తమ అధికారులు, ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు పంపిణీ తదితర కార్యక్రమాలు ఉంటా యి. జిల్లా ఇనచార్జి మంత్రితోపాటు ప్రజాప్రతినిధులు, స్వాతంత్య్ర సమరయోధులు, అధికారులు, ఉద్యోగులు, విద్యార్థులు, నగర ప్రజలు పాల్గొననున్నారు. జాయింట్ కలెక్టర్ రామసుందర్రెడ్డి, ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్లు ఏర్పాట్లను పరిశీలించారు. ప్రథమ చికిత్స కేంద్రాన్ని, అందరికీ తాగునీరు, విద్యార్థులకు ఫలాహారాలను అందించడంతోపాటు శకటాలు, స్టాల్స్ తదితర అన్ని ఏర్పాట్లను పగడ్బందీగా చేయాలని ఆయా శాఖల అధికారులను జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. వర్షం వస్తే కూడా జెండా వందనానికి ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ సంబంధిత అధికారులకు సూచించారు. 14వ తేదీ రాత్రి లోపు అన్ని ఏర్పాట్లను పూర్తి చేయించాలని ప్రజా ప్రతినిధులు, స్వాతంత్య్ర సమరయోఽధులను డీఆర్వో నాగేశ్వరరావు కోరారు. స్వాతంత్య్రదినం సందర్భంగా ఆయా శాఖల్లో ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు ప్రశంపాపత్రాలు అందజేయనున్నారు. ప్రతి శాఖ నుంచి ఉత్తమ సేవలు అందించిన ముగ్గురు అధికారులకు ప్రశంసాపత్రాలు అందజేయనున్నారు. జిల్లాలో దాదాపు 300 మంది ఉద్యోగులు జిల్లా ఇంచార్జి మంత్రి చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందుకోనున్నారు. ఏడు పాఠశాలలకు సంబంధించిన విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టనున్నారు.