కొవిడ్ వ్యాక్సినేషన్కు సర్వం సిద్ధం!
ABN , First Publish Date - 2021-01-16T05:44:11+05:30 IST
జిల్లాలో మొదటి విడత కొవిడ్ వాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు అధికారు లు ఏర్పాట్లు పూర్తిచేశారు
నేడు తొలి విడత నిర్వహణకు అఽధికారులు ఏర్పాట్లు
శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి/టెక్కలి/పాలకొండ, జనవరి 15: జిల్లాలో మొదటి విడత కొవిడ్ వాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు అధికారు లు ఏర్పాట్లు పూర్తిచేశారు. కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఇప్పటికే 2,650 యూనిట్లు జిల్లాకు చేరుకున్నాయి. వాటిని నిర్ధేశించిన 18 కేంద్రాలకు చేరవేశారు. జిల్లాకు తొలివి డతగా వచ్చిన వ్యాక్సిన్ ద్వారా 26,500 మందికి డోసులు వేసేందుకు ఆస్కారం ఉంటుంది. ముందుగా ఆరోగ్య సిబ్బందికి మాత్రమే వ్యాక్సిన్ వేస్తారు. ఇప్పటివరకు 21,943 మంది ఆరోగ్య సిబ్బంది నమోదయ్యారు. వ్యాక్సి నేషన్ కార్యక్రమం నేటి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు. తొలి విడత వ్యాక్సినేషన్లో గర్భిణులు, బాలింతలను మినహా యించారు. 18 కేంద్రాల్లో వ్యాక్సినేషన్లు భద్రపరిచారు. ఉదాహరణకు పాలకొండ ఏరియా ఆస్పత్రికి జిల్లా కేంద్రం నుంచి 500 డోసులు వచ్చినట్లు సూపరింటెండెంట్ జె.రవీం ద్రకుమార్ తెలిపారు. వీట్ని ప్రత్యేక ఫీజర్లలో భద్ర పరిచినట్లు చెప్పారు. అలాగే టెక్కలి ఆసుపత్రికి 500 వైల్స్ చేరినట్లు డిప్యూటీ డీఎంహెచ్ఓ కె లీలా తెలిపారు. గురువారం టెక్కలి చేరుకున్న వ్యాక్సిన్కు ఎస్ఐ ఎన్ కామేశ్వరరావు సిబ్బందితో బందోబస్తు మధ్య ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. వ్యాక్సిన్ను ప్రత్యేకంగా భద్రపరిచినట్లు టెక్కలి జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ కణితి కేశవరావు తెలిపారు.
ఫ పర్యవేక్షణాధికారులుగా...
ప్రతి కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రం వద్ద మహిళా పోలీసు, డిజిటల్ అసిస్టెంట్, వాక్సినేషన్ అధికారి, అంగన్వాడీ కార్యకర్త, ఆశాలు సభ్యులుగా బృందాన్ని ఏర్పాటు చేశారు. ఒక వైద్యాధికారిని నియమించారు. ఇచ్ఛాపురం, మందస, పలాస, టెక్కలిలో కేంద్రాలకు జిల్లా టీబీ నివారణ అధికారి అనూరాధ పర్యవేక్షకులుగా ఉంటారు. రాజాం, సంతకవిటి కేంద్రాలకు ఆర్బీఎస్కే కోఆర్డినేటర్ అప్పారావు, శ్రీకాకుళం, ఆమదాలవలస ఆసుపత్రులకు డీటీటీ కృష్ణమోహన్, పాలకొండ, వీరఘట్టం, కొత్తూరు, పాతపట్టణం ఆసుపత్రులకు డిప్యూటీ డీఎంహెచ్వో నరేష్కుమార్, ఎచ్చెర్ల, రణస్థలం ఆసుపత్రులకు ఎన్ఆర్హెచ్ఎం డీపీఎంవో సత్యప్రకాష్లను నియమించారు.