అంతా పితలాటకం
ABN , First Publish Date - 2022-07-01T06:02:19+05:30 IST
రెవెన్యూశాఖ ఉద్యోగుల బదిలీల్లో ఉన్నతాధికారులు నిబంధనలు గాలికి వదిలేశారు. కేవలం ప్రజాప్రతినిధుల సిఫార్సులకే పెద్దపీట వేసి పోస్టింగ్లు ఇవ్వడానికి నానా అవస్థలు పడ్డారు.
ఇవేమి బదిలీలు బాబోయ్.. అంటూ ఉద్యోగుల బెంబేలు
ఆఖరి రోజు అంతా లోగుట్టు సిఫార్సులతో జాబితాల్లో మార్పులు
రెవెన్యూ ఉద్యోగుల పడిగాపులు
అనంతపురం టౌన, జూన 30: రెవెన్యూశాఖ ఉద్యోగుల బదిలీల్లో ఉన్నతాధికారులు నిబంధనలు గాలికి వదిలేశారు. కేవలం ప్రజాప్రతినిధుల సిఫార్సులకే పెద్దపీట వేసి పోస్టింగ్లు ఇవ్వడానికి నానా అవస్థలు పడ్డారు. ఈ నెల 17 వరకు తొలుత గడువు ఇవ్వగా మళ్లీ ఈ నెలాఖరి వరకు బదిలీలకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. అయినా ఆఖరి రోజు కూడా అయోమయం కొనసాగుతూ వచ్చింది. గురువారం మధ్యాహ్నం బదిలీల జాబితాను విడుదల చేస్తారని రెవెన్యూ ఉద్యోగులు అనుకున్నారు. కానీ పోస్టింగ్ ఉత్తర్వులు విడుదల కాలేదు. దీంతో బదిలీలకు దరఖాస్తు చేసుకున్న తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, ఆర్ఐలు, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు, వీఆర్ఓలు, టైపిస్టులు ఉత్కంఠగా బదిలీల ఉత్తర్వుల కోసం ఎదురుచూస్తూ వచ్చారు. బుధవారం రాత్రే బదిలీల జాబితాకు కలెక్టర్ ఆమోదం వేశారని ప్రచారం జరిగింది. అయితే తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, వీఆర్ఓల నియామకాలు విషయంలో రాప్తాడు, తాడిపత్రి, శింగనమల, కళ్యాణదుర్గం, ఉరవకొండ నియోజకవర్గాలకు సంబంధించి పలు మండలాల ప్రజాప్రతినిధులు వ్యతిరేకించినట్లు సమాచారం. తాము చెప్పిన వారికే పోస్టింగ్ ఇవ్వాలని పట్టుపట్టడంతో చివరకు కలెక్టర్, జేసీ, డీఆర్ఓల సైతం బదిలీల జాబితా విడుదల చేయలేకపోయారన్న ప్రచారం జరిగింది. గురువారం మొత్తం నేతల సూచనల మేరకు జాబితాలు మార్చడానికే ఎక్కువ శ్రమ పడినట్లు సమాచారం. రాత్రి 10గంటల తర్వాత కూడా కొందరు ప్రజాప్రతినిధులు కొన్నింటిపై పట్టుపట్టడంతో మళ్లీ జాబితా మార్పుకు సిద్ధమైనట్లు రెవెన్యూ వర్గాల ద్వారా తెలిసింది. దీంతో బదిలీలు జాబితాను 11గంటలు అవుతున్నా అధికారికంగా విడుదల చేయలేకపోయారు. కానీ ఎంతసేపైనా రాత్రికే జాబితాను విడుదల చేస్తామని ఉన్నతాధికారులు చెబుతూ వచ్చారు. దీంతో బదిలీలు పెట్టుకున్న ఆశావహులు ఉత్తర్వుల కోసం పడిగాపులు కాస్తూ ఉండాల్సి వచ్చింది. బదిలీలు అంటే సీనియారిటీ, స్పౌజ్, పీహెచ కేటగిరి వంటివి పరిగణనలోకి తీసుకుంటారు. సీనియారిటీ జాబితా మేరకు కోరుకున్న వారికి ప్లేస్లు కేటాయించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ రెవెన్యూ బదిలీల్లో కేవలం సిఫార్సులకే ప్రాధాన్యత ఇచ్చి పోస్టింగ్లు కల్పించడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లా కలెక్టర్ పర్యవేక్షించే శాఖలోనే నిబంధనలకు విరుద్ధంగా బదిలీల ప్రక్రియ సాగడంతో పాటు ఆఖరి రోజు అర్ధరాత్రి అవుతున్నా ఉత్తర్వులు విడుదల కాకపోవడంతో ఇవేం బదిలీలు బాబోయ్ అంటూ రెవెన్యూ ఉద్యోగులు అవాక్కయ్యారు.