ప్రతిఒక్కరూ భక్తిభావాన్ని కలిగి ఉండాలి: ఎమ్మెల్యే
ABN , First Publish Date - 2022-09-30T05:02:33+05:30 IST
ప్రతిఒక్కరూ భక్తిభావాన్ని కలిగి ఉండాలని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్రావు అన్నారు. గురువారం మిరుదొడ్డి మండలం లక్ష్మీనగర్ గ్రామంలో దేవీ నవరాత్రోత్సవాల్లో భాగంగా దుర్గాదేవి వద్ద పూజలను నిర్వహించి మాట్లాడారు.
పలు మండలాల్లో కొనసాగుతున్న దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
మిరుదొడ్డి, సెప్టెంబరు 29: ప్రతిఒక్కరూ భక్తిభావాన్ని కలిగి ఉండాలని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్రావు అన్నారు. గురువారం మిరుదొడ్డి మండలం లక్ష్మీనగర్ గ్రామంలో దేవీ నవరాత్రోత్సవాల్లో భాగంగా దుర్గాదేవి వద్ద పూజలను నిర్వహించి మాట్లాడారు. భక్తిభావాన్ని అలవర్చుకోవడం ద్వారా మానసిక ప్రశాంతత కలుగుతుందని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యేను మండప నిర్వాహకులు శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మిరుదొడ్డి మండలాధ్యక్షుడు దేవరాజు తదితరులు పాల్గొన్నారు.
చేర్యాల: చేర్యాల పట్టణంలోని చావడి వద్ద దేవీ స్నేహయూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత వద్ద గంపరాజు సహకారంతో అన్నదానం చేశారు. వాసవీనగర్లో దేవీ వాసవీ పరపతి సంఘం ఆధ్వర్యంలో దుర్గాదేవిని కూరగాయలతో అలంకరించి శాకంబరిగా పూజించారు. రాజీవ్నగర్ కాలనీ, బీడీ కాలనీ, వేణుగోపాలస్వామి వీధుల్లో అమ్మవారికి విశేష పూజలు జరిపారు. అలాగే కొమురవెల్లి మండలం మర్రిముచ్ఛాలలో వెంకటేశ్వర్లు అన్నదానం చేపట్టారు.
చిన్నకోడూరు: చిన్నకోడూరు మండల కేంద్రంలో ముదిరాజ్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నెలకొల్పిన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, కుంకుమార్చన చేశారు. అనంతరం ఎంపీటీసీల ఫోరం మండలాఽధ్యక్షుడు ఇట్టబోయిన శ్రీనివాస్ సహకారంతో అన్నదాన వితరణ చేపట్టారు. టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శ్రీనివాస్, సర్పంచ్ ఉమే్షచంద్ర, ఎంపీటీసీ శారదరమేష్ పాల్గొన్నారు.
కొండపాక: కొండపాక మండలంలోని మర్పడగ విజయదుర్గా సమేత సంతాన మల్లికార్జునస్వామి క్షేత్రంలో గురువారం దుర్గాదేవి భక్తులకు అన్నపూర్ణా మాతగా దర్శనమిచ్చింది. ఈ సందర్భంగా క్షేత్ర నిర్వాహకులు చెప్పెల హరినాథశర్మ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు రవీందర్ పాల్గొన్నారు.
సిద్దిపేట కల్చరల్: సిద్దిపేటలోని హౌసింగ్ బోర్డు చైతన్యపురి కాలనీలో మైసమ్మ దేవీ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో దేవీ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. గురువారం శాకంబరిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా మహిళలు కుంకుమార్చన, పూజలు నిర్వహించారు.