Electricity charges: ప్రతి ఏటా విద్యుత్‌ ఛార్జీల పెంపు ?

ABN , First Publish Date - 2022-08-03T15:07:26+05:30 IST

విపరీతమైన రుణభారంతో అవస్థలు పడుతున్న రాష్ట్ర విద్యుత్‌ బోర్డు ప్రతియేటా విద్యుత్‌ ఛార్జీ(Electricity charges)లను పెంచేందుకు సిద్ధమవుతోంది.

Electricity charges: ప్రతి ఏటా విద్యుత్‌ ఛార్జీల పెంపు ?

చెన్నై, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): విపరీతమైన రుణభారంతో అవస్థలు పడుతున్న రాష్ట్ర విద్యుత్‌ బోర్డు ప్రతియేటా విద్యుత్‌ ఛార్జీ(Electricity charges)లను పెంచేందుకు సిద్ధమవుతోంది. ప్రతియేటా జూలైలో ఆరు శాతం మేరకు విద్యుత్‌ ఛార్జీల(Electricity charges)ను పెంచాలని భావిస్తోంది. రాష్ట్రంలో 2014 తర్వాత ఏడేళ్లుగా విద్యుత్‌ ఛార్జీలను పెంచలేదు. ఈ కారణంగా వివిధ సంస్థల నుంచి రుణాలు పొంది, వాటికి వడ్డీలు మాత్రమే చెల్లించగల దయనీయ స్థితికి చేరింది. రాష్ట్ర ప్రభుత్వం ఉదయ్‌ పథకం అమలుకు సంతకం చేసినప్పటి నుంచి పరిస్థితి మరింత దిగజారిపోయింది. విద్యుత్‌ బోర్డులో ఏర్పడే నష్టాలను ప్రభుత్వమే భరించాల్సి వస్తోంది. ప్రస్తుతం విద్యుత్‌ బోర్డు రుణభారం రూ.1.59,823 కోట్లుగా ఉంది. ఈ రుణాలకు ప్రతియేటా విద్యుత్‌ బోర్డు(Electricity Board) రూ.16,511 కోట్లు వడ్డీ చెల్లిస్తోంది. ఈ పరిస్థితుల్లో కేంద్రప్రభుత్వం ప్రతియేటా విద్యుత్‌ ఛార్జీలను పెంచితేనే సబ్సిడీ మంజూరు చేస్తామంటూ ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం ప్రతియేటా రాష్ట్ర విద్యుత్‌ బోర్డుకు రూ.10,793 కోట్ల మేర సబ్సిడీని మంజూరు చేస్తోంది. గత రెండేళ్లుగా విద్యుత్‌ ఛార్జీలు పెంచలేదన్న కారణంగా ఆ సబ్సిడీ నిలిపివేస్తామంటూ కూడా కేంద్ర ప్రభుత్వం(Central Govt) హెచ్చరించింది. ఈ పరిస్థితుల్లో అప్పుల ఊబిలో కొట్టమిట్టాడుతున్న విద్యుత్‌ బోర్డు యేటా విద్యుత్‌ ఛార్జీలను పెంచేందుకు చర్యలు ప్రారంభించింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం స్వల్పంగా పెంచిన విద్యుత్‌ ఛార్జీలు, విద్యుత్‌ మీటర్లకు అద్దెలు ఈ సెప్టెంబరు నుంచి అమలులోకి రానున్నాయి.

Updated Date - 2022-08-03T15:07:26+05:30 IST