ప్రతి గర్భిణికి సాధారణ కాన్పు చేయాలి

ABN , First Publish Date - 2022-05-19T04:54:30+05:30 IST

ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల కు కాన్పు కోసం వచ్చే గర్భిణులకు సాధారణ కాన్పులే చేయాలని, తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే సీజేరియన్‌ ఆపరేషన్‌ చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఎంహెచ్‌ఎన్‌ జాయింట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ పద్మజ ఆదేశించారు.

ప్రతి గర్భిణికి సాధారణ కాన్పు చేయాలి
మాట్లాడుతున్న ఎంహెచ్‌ఎన్‌ జేడీ డాక్టర్‌ పద్మజ

- ఎంహెచ్‌ఎన్‌ జేడీ డాక్టర్‌ పద్మజ

మహబూబ్‌నగర్‌ (వైద్యవిభాగం), మే 18 : ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల కు కాన్పు కోసం వచ్చే గర్భిణులకు సాధారణ కాన్పులే చేయాలని, తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే సీజేరియన్‌ ఆపరేషన్‌ చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఎంహెచ్‌ఎన్‌ జాయింట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ పద్మజ ఆదేశించారు. బుధవారం ఆమె మహబూబ్‌నగర్‌ జిల్లాలోని పలు పీహెచ్‌సీలను సందర్శించిన అనంత రం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమీక్ష సమావే శంలో మాట్లాడారు. అంగన్‌వాడీ, ఆశ కార్యకర్తలు ప్రతీ ఇంట్లో గర్భిణులను గుర్తించి వారి పేర్లను నమోదు చేయాలన్నారు. అంతేకాకుండా వారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యసేవలు పొందేలా చేయాల్సిన బాధ్యత ఆ గ్రామంలోని ఏఎన్‌ ఎం, ఆశ కార్యకర్తలదేనని అన్నారు. ముఖ్యంగా హైరిస్కు కేసులను గుర్తించి వారికి సరైన వైద్యసేవలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందించాలని ఆదేఽశించారు. అదేవిధంగా ప్రస్తుతం కొత్తగా ఎంసీబీ కార్డుల్లో మార్పులు చేశామని, ఖచ్చితంగా ప్రతీ గర్భిణి వివరాలు అందులో నమోదు చేయాలని సూచించారు. అందులోని మదర్‌ ఐడీ ఆధారంగా తెలంగాణ రాష్ట్రంలోని ఎక్కడినుంచైనా వారు వైద్యసేవలు పొందేవిధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్యను పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డా. కృష్ణ, డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో డా. సరస్వతి, అదనపు డీఎంఅండ్‌హెచ్‌వో డా. శశికాంత్‌, ప్రోగ్రాం ఆఫీసర్లు డా. శంకర్‌, డా. భాస్కర్‌ నాయక్‌, డెమో డా. తిరుపతిరావు, జిల్లా మలేరియా అధికారి డా. విజయ్‌కుమార్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-19T04:54:30+05:30 IST