Even boys not safe in Delhi: ఢిల్లీలో అబ్బాయిలకూ రక్షణ కరువు.. 12ఏళ్ల బాలుడిపై సామూహిక అత్యాచారం
ABN , First Publish Date - 2022-09-25T22:34:20+05:30 IST
దేశంలో అమ్మాయిలకే కాదు.. అబ్బాయిలకూ రక్షణ లేకుండా పోతోంది. కామంతో కళ్లు మూసుకుపోతున్న మగాళ్లు
న్యూఢిల్లీ: దేశంలో అమ్మాయిలకే కాదు.. అబ్బాయిలకూ రక్షణ లేకుండా పోతోంది. కామంతో కళ్లు మూసుకుపోతున్న మగాళ్లు మృగాళ్లలా మారి కనిపించిన వారిని కాటేస్తున్నారు. కనీస విచక్షణ మరిచి కాలకేయుల్లా ప్రవర్తిస్తున్నారు. ప్రభుత్వాలు, పోలీసులు, చట్టాలు ఏవీ వారిని అడ్డుకోలేకపోతున్నాయి. దేశంలో నిత్యం ఇలాంటి ఘటనలు ఎక్కడో ఓ చోట వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన దారుణ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చి అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది.
12 ఏళ్ల బాలుడిపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడి ఆపై కర్రలతో కొట్టి చంపేశారు. ఈ ఘటనపై ఢిల్లీ మహిళా కమిషన్(Delhi Commission for Women) చీఫ్ స్వాతి మలీవల్ ట్వీట్ చేస్తూ.. ఢిల్లీలో చివరికి బాలలకు కూడా రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన మహిళా కమిషన్ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘‘ఢిల్లీలో అమ్మాయిలకే కాదు, అబ్బాయిలకూ రక్షణ లేకుండా పోయింది. 12 ఏళ్ల బాలుడిపై నలుగురు వ్యక్తుల పాశవింగా అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత కర్రలతో చావబాదారు. ఈ ఘటనపై మా బృందం పోలీసులకు ఫిర్యాదు చేసింది’’ అని మలీవల్ (Swati Maliwal) తన ట్వీట్లో పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు పోలీసులు ఒక నిందితుడిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మిగతా ముగ్గురి కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనపై మహిళా కమిషన్ ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేసింది.