Evaru Meelo Koteeswarulu: అయ్యో ఎంత పనైంది ప్రత్యూష.. ఆ ఒక్క పని చేసి ఉంటే..

ABN , First Publish Date - 2021-10-07T17:59:10+05:30 IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న..

Evaru Meelo Koteeswarulu: అయ్యో ఎంత పనైంది ప్రత్యూష.. ఆ ఒక్క పని చేసి ఉంటే..

ఇంటర్‌నెట్‌డెస్క్: యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ రియాలిటీ గేమ్ షో మంచి రేటింగ్‌తో దూసుకెళ్తోంది. హైదరాబాద్‌కు చెందిన ప్రత్యూష సోమవారం నుంచి బుధవారం వరకు హాట్ సీట్‌పై కూర్చొని గేమ్‌ను కొనసాగించారు. తన సమయస్ఫూర్తితో ప్రశ్నలకు సమాధానం చెబుతూ ఎన్టీఆర్‌తో పాటు ప్రేక్షకులనూ ప్రత్యూష ఆకట్టుకున్నారు. బుధవారం ఆమె కోటి రూపాయల ప్రశ్నను చూస్తారనే వీక్షకులు అనుకున్నారు. కానీ ఆమెకు దురదృష్టం వెంటాడింది. 


14వ ప్రశ్నగా ఎన్టీఆర్ కింది ప్రశ్నను అడిగారు..

2000లో మొదలైన కొత్త మిలీనియంలో, భారత తపాల శాఖ విడుదల చేసిన మొదటి స్మారక తపాల బిళ్ల మీద వీరిలో కనిపించిన వ్యక్తి ఎవరు?

(ఎ) ఎన్ జి రంగా

(బి) పొట్టి శ్రీరాములు

(సి) ఎన్టీరామారావు

(డి) బూర్టుల రామకృష్ణారావు



పై ప్రశ్నకు సమాధానం తెలియకపోడంతో ఆమె లైఫ్‌లైన్ వినియోగించుకున్నారు. తన సోదరుడు రోహిత్‌కు వీడియో కాల్ చేశారు. అతడు కూడా సమాధానం చెప్పలేకపోవడంతో.. ప్రత్యూష టెన్షన్‌లో పడ్డారు. ఇక్కడే ఆమె ధైర్యాన్ని అందరూ మెచ్చుకోవాలి. తన తల్లి చికిత్స కోసం డబ్బు అవసరమని చెప్పిన ప్రత్యూష.. రూ.50 లక్షల ప్రశ్నకు ధైర్యం చేసి (సి) ఆష్షన్‌ను ఫిక్స్ చేయమన్నారు. కానీ ఆమె చెప్పిన సమాధానం తప్పైంది. బూర్గుల రామకృష్ణారావు సరైన జవాబు కావడంతో.. ఆమె గేమ్ నుంచి నిష్క్రమించారు. ఆమె క్విట్ ఆప్షన్ ఎంచుకొని ఉంటే.. ఆమెకు రూ.25లక్షలు వచ్చేవి. చివరకు ఆమె తప్పు సమాధానం చెప్పడంతో.. రూ.320000లకు పడిపోయారు. కానీ ఆమె చూపిన పోరాట పటిమను ఎన్టీఆర్ మెచ్చుకున్నారు. గేమ్‌లో ఓడిన ప్రేక్షకుల మనస్సును ఆమె గెలుచుకున్నారు. 


Updated Date - 2021-10-07T17:59:10+05:30 IST