భారత్ నుంచి అనవసర ప్రయాణాలను నిలిపివేయండి: ఈయూ
ABN , First Publish Date - 2021-05-13T15:51:43+05:30 IST
భారత్లో కొనసాగుతున్న కరోనా కల్లోలం నేపథ్యంలో యూరోపియన్ యూనియన్ దేశాలు భారతదేశం నుండి అనవసరమైన ప్రయాణాలను తాత్కాలికంగా నిలిపివేయాలని యూరోపియన్ యూనియన్ కమిషన్ బుధవారం కోరింది.
బ్రస్సెల్స్: భారత్లో కొనసాగుతున్న కరోనా కల్లోలం నేపథ్యంలో యూరోపియన్ యూనియన్ దేశాలు భారతదేశం నుండి అనవసరమైన ప్రయాణాలను తాత్కాలికంగా నిలిపివేయాలని యూరోపియన్ యూనియన్(ఈయూ) కమిషన్ బుధవారం కోరింది. ఇండియాలో కనుగొనబడ్డ కోవిడ్-19 B.1.617.2 వేరియంట్ను 'ఆందోళనకర స్థాయిలో వేగంగా వ్యాపించేది'గా వర్గీకరించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో) సోమవారం చేసిన ప్రతిపాదనను ఈ సందర్భంగా యూరోపియన్ కమిషన్ ఉదాహరించింది. ఈ నేపథ్యంలోనే యూరోపియన్ కంట్రీస్ భారత్ నుంచి అనవసర ప్రయాణాలకు తాత్కాలింగా బ్రేక్ వేయాలని కమిషన్ కోరింది. దీంతో భారత్లోని కొత్త వేరియంట్ యూరోపియన్ దేశాలకు ప్రబలకుండా నిరోధించవచ్చని పేర్కొంది. తప్పనిపరిస్థితుల్లో వచ్చేవారికి క్వారంటైన్, టెస్టులు చేయాలని సూచించింది. ఇదిలాఉంటే.. భారత్లో కరోనా విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. గడిచిన 24 గంటల్లో బుధవారం రికార్డుస్థాయిలో మరణాలు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో కరోనా మరణాల సంఖ్య 2.50లక్షల మార్కును దాటిపోయింది.