ఆహార భద్రతకు ఇథనాల్ ముప్పు

ABN , First Publish Date - 2021-02-23T06:12:06+05:30 IST

కొత్త వ్యవసాయచట్టాలపై ఆంధ్రజ్యోతిలో ఈ నెల 5వ తేదీన వచ్చిన వ్యాసంలో సత్యసాగర్ పేర్కొన్న విషయాలన్నీ...

ఆహార భద్రతకు ఇథనాల్ ముప్పు

కొత్త వ్యవసాయచట్టాలపై ఆంధ్రజ్యోతిలో ఈ నెల 5వ తేదీన వచ్చిన వ్యాసంలో సత్యసాగర్ పేర్కొన్న విషయాలన్నీ సంపూర్ణ సత్యాలు. వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్ విధానాల వల్ల ఉపాధి అవకాశాలు పెరిగే మాట నిజమే కానీ ఆ ఉపాధిని కోల్పోయే వారి సంఖ్య తక్కువగా ఉండదనేది కూడా ఎవరూ నిరాకరించలేని సత్యం. ఇప్పటికే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు కొన్ని వేలకోట్లతో అత్యాధునికమైన సప్లైచైన్‌కు సరిపోయేటటువంటి గిడ్డంగులను అదాని గ్రూప్ నిర్మించింది. అంతేకాకుండా ఈ మధ్యనే ప్రవేశపెట్టిన మరో చట్టం పెట్రోల్, డీజిల్‌లో 10 శాతం ఇథనాల్‌ను కలపడానికి అనుమతిస్తోంది. ఇథనాల్ తయారీకి కావలసిన బార్లీ, జొన్న, ముఖ్యంగా చెరకు పండించేందుకు లక్షల ఎకరాలు కావాలి. దానికోసమే కొత్త చట్టాలు. కార్పొరేట్ కంపెనీలు కాంట్రాక్ట్ పద్ధతిలో లక్షల ఎకరాలు తీసుకొని ఇంథన పంటలు పండించి వారి దగ్గర ఇంతకుముందే ఉన్నటువంటి బంకుల ద్వారా ఇథనాల్ కలిపిన పెట్రోల్, డీజిల్ అమ్మి ఇంకా ఎక్కువగా లాభాలు గడించడం ఖాయం. మన దేశంలో ఆహారధాన్యాల కన్నా పెట్రోల్, డీజిల్ అమ్మకాలు ఎక్కువగా ఉన్నాయి. వీటికి నిరంతర డిమాండ్ కూడా ఉంటుంది. అంతేకాకుండా ఇథనాల్ తయారీలో మిగిలినటువంటి పదార్థాలన్నిటినీ ఇతరత్రా లాభదాయకమైన వస్తువుల తయారీ కోసం వాడుకోవచ్చు. దాని పర్యవసానం ఏమిటంటే ఇప్పటివరకు ధాన్యం, పప్పుదినుసులు, కూరగాయలు, నూనె పంటలు పండించే లక్షల ఎకరాలలో ఇథనాల్ ఉత్పత్తికి తోడ్పడే పంటలు పండిస్తారు. తద్వారా ఆర్థిక, ఆహార భద్రతకు ముప్పు మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. 

డాక్టర్ ఎంహెచ్ ప్రసాదరావు, సిరిసిల్ల

Updated Date - 2021-02-23T06:12:06+05:30 IST