నా హత్యకు కుట్ర నిజమే.. త్వరలో ఫొటోలు రిలీజ్ చేస్తా : Etela

ABN , First Publish Date - 2021-07-20T18:04:37+05:30 IST

ఆరోపణకు కట్టబడి ఉన్నాను.. త్వరలోనే ఫోటోలతో ఆధారాలు విడుదల చేస్తాను..

నా హత్యకు కుట్ర నిజమే.. త్వరలో ఫొటోలు రిలీజ్ చేస్తా : Etela

వరంగల్ అర్బన్ జిల్లా : తనపై ఓ మంత్రి హంతక ముఠాతో చేతులు కలిపి పాదయాత్రను అడ్డుకుని, దాడి చేసేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నాడని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ సంచలన ఆరోపణలు చేసిన విషయం విదితమే. తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయిన ఈ వ్యాఖ్యలపై మంత్రి గంగుల కమాలకర్ స్పందిస్తూ.. సీబీఐ, ఎన్‌ఐఏతో విచారణ జరిపించుకోవచ్చని.. తాను సిద్ధంగానే ఉన్నానని ఒకింత సవాలే విసిరారు. గంగుల మాట్లాడిన మాటలపై మరోసారి ఈటల రాజేందర్ స్పందిస్తూ.. ‘ఓ మంత్రి హంతక ముఠాతో చేతులు కలిపి నాహత్యకు కుట్ర చేస్తున్నారనేది ఆరోపణకు కట్టబడి ఉన్నాను.. త్వరలోనే ఫోటోలతో ఆధారాలు విడుదల చేస్తాను’ అని స్పష్టం చేశారు.


అడుగడుగునా అడ్డంకులు..

ఓడిపోతామన్న అసహనంతో ఇలాంటి చిల్లర పనులకు పాల్పడుతున్నారు. దళితులకు మూడెకరాల హామీ ఏమైంది..?. దళితులకు సబ్‌ప్లాన్ నిధులు అందించలేదు. ఇప్పుడు హుజూరాబాద్ ఎన్నికలు టార్గెట్‌గా మళ్లీ హామీలు ఇస్తున్నారు. ప్రభుత్వం, అధికార పార్టీ ఎన్ని కుట్రలు చేసినా నియోజకవర్గ ప్రజలు నావెంటే ఉన్నారు. డబ్బులు పెట్టే శక్తి నాకు లేదు అందుకే ప్రజలను జాగృతం చేస్తున్నాను. నా పాదయాత్రకు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారు. ఏడేళ్లుగా తెలంగాణ అభివృద్ధికి నోచుకోలేదు. ఎన్ని డబ్బులు ఖర్చు చేసినా ఏ ప్రయోగాలు చేసినా హుజూరాబాద్ ప్రజలు నావెంటే ఉంటారు. హుజూరాబాద్ ఎన్నికల సందర్భంగానైనా ఉద్యోగాల నియామకాలు జరగాలి. ఓటు పదివేల రూపాయలు ఇస్తారట.. తీసుకోండి కమలం గుర్తుకు ఓటు వేయండి. డబుల్ బెడ్రూం ఇళ్లు సొంతంగా నిర్మించుకునే అవకాశం కల్పించాలి అని ఈటల చెప్పుకొచ్చారు.

Updated Date - 2021-07-20T18:04:37+05:30 IST