స్వలాభం కోసమే ఈటల రాజీనామా: హరీశ్రావు
ABN , First Publish Date - 2021-10-08T00:22:30+05:30 IST
మాజీ మంత్రి ఈటల రాజేందర్ స్వలాభం కోసమే రాజీనామా చేసి బీజేపీలో చేరారని మంత్రి తన్నీరు హరీశ్రావు తెలిపారు.
హుజూరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ స్వలాభం కోసమే రాజీనామా చేసి బీజేపీలో చేరారని మంత్రి తన్నీరు హరీశ్రావు తెలిపారు. గురువారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలంలోని ధర్మరాజుపల్లి, పెద్దపాపయ్యపల్లి, చిన్నపాపయ్యపల్లి, కాట్రపల్లి, సిర్సపల్లి, పోతిరెడ్డిపేట గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హుజూరాబాద్లో జరిగే ఉప ఎన్నికలో ధర్మాన్ని, న్యాయాన్ని గెలిపించాలని పిలుపునిచ్చారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక ఈటల రాజేందర్ స్వార్థంతోనే వచ్చిందన్నారు. వ్యవస్థ ఏదైనా వ్యక్తి లాభం కంటే వ్యవస్థ లాభం ముఖ్యమని పేర్కొన్నారు. ఈటల రాజేందర్ ఎందుకు బీజేపీలో చేరారో, బీజేపీ ప్రజలకు ఏం చేసిందో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. నియోజకవర్గంలో తనను చూసే పనులు జరుగుతున్నాయని ఈటల చెప్తున్నాడని, అలా అయితే కేసీఆర్ రైతు బంధు, రైతు బీమా, 24గంటల కరెంట్ ఎవరిని చూసి ఇచ్చారని హరీశ్రావు ప్రశ్నించారు.