TS News: కేసీఆర్కు ప్రజలపై నమ్మకం లేదు: ఈటల
ABN , First Publish Date - 2022-09-17T03:04:13+05:30 IST
ఓట్లు, అధికార దాహం తప్ప ప్రజలపై సీఎం కేసీఆర్ (CM KCR)కు విశ్వాసం లేదని ఎమ్మెల్యే ఈటల రాజేందర్
హుస్నాబాద్: ఓట్లు, అధికార దాహం తప్ప ప్రజలపై సీఎం కేసీఆర్ (CM KCR)కు విశ్వాసం లేదని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Etala Rajender) విమర్శించారు. సీఎం చెప్పే మాటలకు చేసే పనికి పొంతన ఉండదని ఎద్దేవా చేశారు. శుక్రవారం హుస్నాబాద్ మండలం మహ్మదాపూర్ గుట్టల్లో తెలంగాణ సాయుధ పోరాటంలో అమరులైన అనభేరి ప్రభాకర్రావు, సింగిరెడ్డి భూపతిరెడ్డి మరో 12 మంది అమరుల ఘాట్ వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ విమోచన దినం జరపాలని డిమాండ్ చేసిన కేసీఆర్, అధికారంలోకి వచ్చిన ఎనిమిదేళ్లలో ఆ ప్రస్తావన తేలేదన్నారు. కేంద్రమంత్రి అమిత్షా (Union Minister Amit Shah) తెలంగాణ పర్యటన సందర్భంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరిపిస్తామని హామీ ఇచ్చి, సెప్టెంబర్ 17న హైదరాబాద్ (Hyderabad)లో జాతీయ జెండా ఎగరేసేందుకు వస్తున్న సందర్భంలో తోక ముడిచిన కేసీఆర్ సమైక్యతా రాగంతో ముందుకు వచ్చారని ఈటల విమర్శించారు.
కేసీఆర్ ఎన్ని ఎత్తుగడలు పన్నినా తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. తమ బిడ్డ ఈటల రాజేందర్కు అన్యాయం జరిగిందని హుజూరాబాద్ ప్రజలు ఒక్కటై తనను అసెంబ్లీకి పంపితే తన గళాన్ని వినిపించకుండా కుట్రచేసి బయటకు పంపిన విషయాన్ని ప్రజలు అసహ్యించుకుంటున్నారని తెలిపారు. మునుగోడు ఎన్నికల్లో కేసీఆర్ దుర్మార్గాలను ఎండగట్టి బీజేపీకి పట్టం కట్టేందుకు అనేక మంది వస్తున్నారని తెలిపారు. అసెంబ్లీ సాక్షిగా బీజేపీ మూడు తోకలని తమను అవమాన పరిచారని, పార్లమెంట్లో రెండు సీట్లు ఉన్న బీజేపీ 300 సీట్లు సాధించి అధికారంలోకి వచ్చిన సంగతి కేసీఆర్ గుర్తుపెట్టుకోవాలన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక తెలంగాణా అమరుల పోరాట స్ఫూర్తి కేంద్రాలను శృతివన కేంద్రాలుగా తీర్చిదిద్దుతామని ఈటల రాజేందర్ ప్రకటించారు.