నాపై దాడి చేస్తే హుజురాబాద్ అగ్నిగుండం అవుతుంది: ఈటల
ABN , First Publish Date - 2021-10-03T20:48:14+05:30 IST
కరీంనగర్: తనపై దాడికి కుట్ర జరుగుతున్నట్లు అనుమానం వ్యక్తమవుతుందని ఈటల రాజేందర్ అన్నారు.
కరీంనగర్: తనపై దాడికి కుట్ర జరుగుతున్నట్లు అనుమానం వ్యక్తమవుతోందని బీజేపీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఆదివారం హుజురాబాద్లో బీజేపీ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ తనపై దాడి చేస్తే హుజురాబాద్ అగ్నిగుండం అవుతుందని హెచ్చరించారు. ఆ తర్వాత జరిగే పరిణామాలకు సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలన్నారు. హుజురాబాద్లో టీఆర్ఎస్ రూ.100 కోట్లు ఖర్చు చేస్తోందని ఆరోపించారు. ముఖ్యమంత్రికి నిజాయితీ ఉంటే ధర్మంగా కొట్లాడాలన్నారు. హుజురాబాద్లో టీఆర్ఎస్కు డిపాజిట్లు కూడా రావన్నారు. కేసీఆర్ కుట్రలు, కుతంత్రాలు, డబ్బు, మద్యాన్ని నమ్ముకున్నారని ఈటల విమర్శించారు.
తాను గన్ మెన్లపై ఆధారపడి ఉండలేదని, తనలాంటి వాళ్లను కాపాడుకునే కర్తవ్యం తెలంగాణ ప్రజలకు ఉందని ఈటల అన్నారు. ఉద్యమాలు చేసినప్పుడు.. ఇప్పుడూ అలాగే ఉన్నామని స్పష్టం చేశారు. నీచమైన కార్యక్రమాలకు టీఆర్ఎస్ నేతలు పాల్పడడుతున్నారని ఈటల మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, స్థానిక నేతలు పాల్గొన్నారు.