బ్రేకింగ్ : ఏపీ ఈఎస్ఐలో భారీ కుంభకోణం
ABN , First Publish Date - 2020-02-21T17:03:06+05:30 IST
తెలంగాణలో ఈఎస్ఐ స్కామ్ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా..
అమరావతి : తెలంగాణలో ఈఎస్ఐ స్కామ్ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా.. ఏపీ ఈఎస్ఐలోనూ భారీ కుంభకోణం వెలుగచూసింది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ స్కామ్ను బయటపెట్టింది. గత 6ఏళ్లలో కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారని నిర్ధారణ అయ్యింది. లేని కంపెనీల నుంచి నకిలీ కొటేషన్లు తీసుకుని ఆర్డర్లు చేసి ఈ తతంగానికి పాల్పడ్డారు.
రూ.51 కోట్లు ఈఎస్ఐ డైరెక్టర్లు చెల్లించారు. ఈఎస్ఐ డైరెక్టర్లు రవికుమార్, రమేష్, విజయ బాధ్యులుగా గుర్తించారు. మందులు, పరికరాలను వాస్తవ ధరకంటే 136 శాతం అధికంగా టెండర్లలో సంస్థలు చూపించాయి. లెజెండ్ ఎంటర్ప్రైజెస్, ఓమ్మిమేడి ఎన్వెంటర్ ఫెర్ఫామెన్స్ సంస్థలకు అక్రమంగా 85 కోట్ల రూపాయిలను డైరెక్టర్లు చెల్లించారు. ఆ ఈఎస్ఐ డైరెక్టర్లకు ఆరుగురు జాయింట్ డైరెక్టర్లు సహకరించారని తేలింది.
తెలంగాణలో పరిస్థితి ఇదీ...
కాగా.. తెలంగాణలో రూ.200 కోట్ల స్కాంకు పాల్పడ్డ బీమా వైద్య సేవల విభాగం(ఐఎంఎస్) మాజీ డైరెక్టర్ దేవికారాణిపై ఇంకా విచారణ కొనసాగుతోంది. ఆమె అక్రమాస్తుల చిట్టా తవ్విన కొద్దీ బయట పడుతోంది. ఐఎంఎస్ డైరెక్టర్ హోదాలో దేవికారాణి అధికార దుర్వినియోగానికి పాల్పడి కోట్ల రూపాయల ప్రభుత్వ నిధుల్ని పక్కదారి పట్టించినట్లు ఏసీబీ గుర్తించింది.