టీఆర్ఎ్సను నమ్ముకుంటే నట్టేట మునిగినట్టే..
ABN , First Publish Date - 2022-08-04T05:32:08+05:30 IST
టీఆర్ఎ్సను నమ్ముకుంటే నట్టేట మునిగినట్టే..
ఈ నెల 7న అధికారికంగా రాజీనామా చేస్తున్నా..
పార్టీ కోసం పనిచేసినా అవమానాలే మిగిలాయి...
టీఆర్ఎస్ రాష్ట్ర నేత, మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సోదరుడు ప్రదీ్పరావు
వరంగల్ టౌన్, ఆగస్టు 3: టీఆర్ఎ్సను నమ్ముకుంటే న్యాయం జరగడమనేది కల్ల అని, అందుకే ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ఆ పార్టీ రాష్ట్ర నేత, మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తమ్ముడు ఎర్రబెల్లి ప్రదీ్పరావు స్పష్టం చేశారు. ఈనెల 7న టీఆర్ఎ్సకు రాజీనామా చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. వరంగల్లోని ఓసిటీలో గల తన నివాసంలో బుధవారం ఆయన వరంగల్ తూర్పు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, అనుచరులతో సమవేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలో ఎన్ని అవమానాలు జరిగినా ఓపికతో భరించామని, తనతో పాటు తన వారి మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించినా భరించామని తెలిపారు. చివరికి తనను నమ్ముకున్న కార్యకర్తలపై పోలీసులు కేసులు పెట్టించే పరిస్థితులు వచ్చాయని, ఇంత జరుగుతున్నా అధిష్ఠానం నుంచి ఎలాంటి స్పందన కనిపించలేదని పేర్కొన్నారు.
‘ఇన్నేళ్లుగా టీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్నా.. నాకు న్యాయం జరగలేదు. వ్యయప్రయాసలకు ఓర్చి టీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం శ్రమించాం.. ఎన్నో అవమానాలను భరించాం.. అయినా పార్టీ గుర్తించడం లేదు’ అని ప్రదీ్పరావు ఆవేదన వ్యక్తంచేశారు. గత 12 ఏళ్లుగా టీఆర్ఎస్ పార్టీ అనేక అవకాశాలిస్తామని చెప్పిన మాటలు నీటిమూటలుగానే మిగిలాయని, ఏ అవకాశం ఇవ్వకుండా అవమానపరిచిందని తెలిపారు. ఎప్పుడు అడిగినా భవిష్యత్తులో అవకాశాలు కల్పిస్తామని చెప్పడం.. తీరా చూస్తే ఇతరులకు ఇవ్వడం జరిగిందని వెల్లడించారు. ఈ పరిణామాలను భరించడం ఇక తనవల్ల కావడం లేదని, పార్టీకి రాజీనామా చేయడంపై అభిప్రాయాలను తెలపాలని ఆయన కోరగా, ‘మీ వెంటే మేముంటామని’ ఆయన వర్గీయులు స్పష్టంచేశారు.
ఆదరించే పార్టీలో చేరుదాం
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా సాగిన ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించామని, ఉద్యమ ప్రయోజనాల కోసం తాను స్వయంగా ఏర్పాటు చేసిన తెలంగాణ నవ నిర్మాణ సమితి పార్టీని టీఆర్ఎ్సలో విలీనం చేశామని ప్రదీ్పరావు గుర్తు చేసుకున్నారు. వరంగల్ తూర్పు టికెట్టు ఇస్తామని చెప్పి రెండుసార్లు చేయిచ్చారని, ఆ తర్వాత ఎమ్మె ల్సీ పదవి ఇస్తామని చెప్పి ఇవ్వలేదని ఆరోపించారు. అంతేకాకుండా పార్టీలో కూడా అవకాశాలు ఇవ్వలేదని తెలిపారు. ‘మనల్ని ఆదరించి, మంచి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన పార్టీలోనే చేరుదాం’ అని ప్రదీ్పరావు పేర్కొన్నారు.
బుజ్జగింపులు...
ప్రదీ్పరావు టీఆర్ఎ్సను వీడుతున్నట్టు వార్తలు రావడంతో టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ రంగంలోకి దిగారు. ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, రోడ్ డెవల్పమెంట్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు శ్రీనివా్సను దూతలుగా ప్రదీ్పరావు వద్దకు పంపించారు. వారు ప్రదీ్పరావు నివాసానికి వెళ్లి మాట్లాడారు. పార్టీ మారవద్దని బుజ్జగించే యత్నం చేశారు. అంతేకాకుండా, సీఎం కేసీఆర్ మీతో మాట్లాడతారని ఫోన్ కలిపి ఇచ్చినా ప్రదీ్పరావు మాట్లాడలేదని తెలిసింది. ప్రదీ్పరావు నుంచి ఎలాంటి సానుకూల స్పందన రాకపోవడంతో సారయ్య, శ్రీనివాస్ వెనుదిరిగారు.