గులాబీ జెండా ఎగరేద్దాం..

ABN , First Publish Date - 2021-04-23T06:17:53+05:30 IST

గులాబీ జెండా ఎగరేద్దాం..

గులాబీ జెండా  ఎగరేద్దాం..

 మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

హన్మకొండ టౌన్‌, ఏప్రిల్‌ 22: సమన్వయంతో పనిచేసి గ్రేటర్‌ వరంగల్‌ కార్పొరేషన్‌పై గులాబీ జెండా ఎగురవేద్దామని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఇన్‌చార్జిలుగా పనిచేస్తున్న పార్టీ సీనియర్‌ నేతలు, ప్రజాప్రతినిధులతో హన్మకొండలోని హరిత హోటల్‌లో గురువారం రాత్రి  మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రచార తీరుతెన్నులు, సభలు, సమావేశాలు, సమన్వయ కమిటీ సభ్యులను ఎక్కడెక్కడ వినియోగించుకోవాలి? ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం.. తదితర అంశాలపై చర్చించారు. 

ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. ప్రచారంలో ముఖ్య నేతలతో పాటు పార్టీ శ్రేణులు పాల్గొనాలన్నారు. ప్రచారంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని చెప్పారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. వారంరోజులు కష్టపడి కార్పొరేషన్‌పై గులాబీ జెండా ఎగురవేసి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బహుమతిగా ఇవ్వొచ్చన్నారు.  ‘వరంగల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ బీసీలకు పెద్దపీట వేసింది.. రిజర్వేషన్ల ప్రకారం వారి సీట్లు వారికి ఇవ్వడంతో పాటు అదనంగా జనరల్‌ స్థానాల్లోనూ బీసీ, ఎస్సీ మహిళలకు 19 స్థానాల్లో అవకాశం కల్పించారు.. మొత్తం 66 డివిజన్లలో 11 మంది బీసీ పురుషులు, ఏడుగురు బీసీ మహిళలకు, ఒక ఎస్సీ మహిళకు జనరల్‌ స్థానాల్లో అవకాశం కల్పించడం జరిగింది...’ అని మంత్రి దయాకర్‌రావు తెలిపారు.

ఈ సమావేశంలో మంత్రి సత్యవతిరాథోడ్‌, చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌, ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మన్‌ బి.వినోద్‌కుమార్‌, ఎంపీలు బండ ప్రకాశ్‌, పసునూరి దయాకర్‌రావు, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, పార్టీ ఇన్‌చార్జి గ్యాదరి బాలమల్లు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివా్‌సరెడ్డి, ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, టి.రాజయ్య, నన్నపునేని నరేందర్‌, సతీ్‌షకుమార్‌, శంకర్‌నాయక్‌, ‘కుడా’ చైర్మన్‌ యాదవరెడ్డి, నేతలు వాసుదేవరెడ్డి, నాగుర్ల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-23T06:17:53+05:30 IST