Eps, Opsలకు హైకోర్టులో ఊరట
ABN , First Publish Date - 2021-12-15T13:49:11+05:30 IST
అన్నాడీఎంకే జోడెడ్ల నాయకత్వానికి హైకోర్టులో ఊరట లభిం చింది. అన్నాడీఎంకే సమన్వయకర్త, ఉప సమన్వయకర్తగా మాజీ ముఖ్యమంత్రులు ఒ. పన్నీర్ సెల్వం(ఓపీఎస్), ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్)ల ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ
- వారి ఎన్నికను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్ కొట్టివేత
చెన్నై: అన్నాడీఎంకే జోడెడ్ల నాయకత్వానికి హైకోర్టులో ఊరట లభిం చింది. అన్నాడీఎంకే సమన్వయకర్త, ఉప సమన్వయకర్తగా మాజీ ముఖ్యమంత్రులు ఒ. పన్నీర్ సెల్వం(ఓపీఎస్), ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్)ల ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను మద్రాసు హైకోర్టు తోసిపుచ్చింది. పార్టీల సంస్థాగత ఎన్నికల వ్యవహారాలలో కేంద్ర ఎన్నికల సంఘం గానీ, రాష్ట్ర ఎన్నికల సంఘం గానీ జోక్యం చేసుకునే వీలులేదని పేర్కొంటూ.. ఈపీఎస్, ఓపీఎస్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లకు విచారణార్హత లేదని స్పష్టం చేసింది. ఈనెల 7వ తేదీన అన్నాడీఎంకే సమన్వయకర్త, ఉప సమన్వయకర్త పదవులకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ పదవులకు ఓపీఎస్, ఈపీఎస్ మాత్రమే నామినేషన్లు వేయడంతో ఇరువురూ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఎన్నికల నిర్వహణ బాధ్యతలు నిర్వహించిన సి.పొన్నయ్యన్ పొల్లాచ్చి జయరామన్ ప్రకటించారు. ఆ నేపథ్యంలో పన్నీర్సెల్వం, ఎడప్పాడి ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ హోసూరుకు చెందిన అన్నాడీఎంకే సభ్యుడు జయచంద్రన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి మునీశ్వర్నాథ్ భండారీ, న్యాయమూర్తి ఆదికేశవులుతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. అన్నాడీఎంకే సంస్థాగత ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకునే వీలుందో లేదో ఆ సంఘం అభిప్రాయాలను అడిగి తెలుసుకున్న తర్వాత పిటిషన్పై తుది నిర్ణయం ప్రకటించనున్నట్టు గతంలో పేర్కొంది. ఆ మేరకు మంగళవారం ఈపీఎస్, ఓపీఎస్ ఎన్నికను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను తోసిపుచ్చింది.