Panneerselvam: వారితో కలిసి పనిచేద్దాం రండి
ABN , First Publish Date - 2022-08-19T13:33:52+05:30 IST
పార్టీని అభివృద్ధి చేసేందుకు శశికళ, దినకరన్తో కలిసి పనిచేద్దామని అన్నాడీఎంకే సమన్వయకర్త, మాజీ ముఖ్యమంత్రి ఒ. పన్నీర్సెల్వం (Former
- ఈపీఎస్కు ఓపీఎస్ ఆహ్వానం
చెన్నై, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): పార్టీని అభివృద్ధి చేసేందుకు శశికళ, దినకరన్తో కలిసి పనిచేద్దామని అన్నాడీఎంకే సమన్వయకర్త, మాజీ ముఖ్యమంత్రి ఒ. పన్నీర్సెల్వం (Former Chief Minister O. Panneerselvam), ఆ పార్టీ శాసనసభాపక్షనాయకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్)ని పిలుపునిచ్చారు. గురువారం ఉదయం నగరంలో ఓపీఎస్ మీడియాతో మాట్లాడుతూ.. పాత సంగతులను, చేదు అనుభవాలను మరచి పార్టీని పటిష్టపరిచేందుకు తన ప్రియ సోదరుడు ఈపీఎస్ ముందుకురావాలని విజ్ఞప్తి చేశారు. పార్టీ వ్యవస్థాపకుడు ఎంజీఆర్, మాజీ ముఖ్యమంత్రి జయలలిత బాటలో పార్టీని బలపరిచేందుకు అందరూ కలిసి పనిచేయాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు. పార్టీలో విభేదాల వలనే డీఎంకే గెలిచి అధికారంలోకి వచ్చిందని, మరోసారి ఆ పార్టీకి ఇలాంటి అవకాశం కల్పించకూడదని భావిస్తున్నానని చెప్పారు. ప్రస్తుతం పార్టీలో అలాంటి పరిస్థితులు కొనసాగటం మంచిది కాదని, ఎంజీఆర్ తమ్ముళ్లలాగా, అమ్మ (జయ) తనయుల్లాగా వారి బాటలో పయనించేందుకు అందరూ సమైక్యంగా పనిచేయాల్సి ఉందన్నారు. శశికళ, దినకరన్(Shashikala, Dinakaran)ను పార్టీలో చేర్చుకుంటారా? అని విలేఖరులు అడిగిన ప్రశ్నకు ఓపీఎస్(OPS) బదులిస్తూ పార్టీ అభివృద్ధికి పాటుపడినవారంతా సమష్టిగా పార్టీ కోసం పనిచేయాలనే తాను భావిస్తున్నట్టు చెప్పారు. పార్టీని విజయపథంలో తీసుకెళ్లేందుకు అందరిని కలుపుకోవాలని తాను విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. శశికళ, దినకరన్ తమ వద్దకు రావాలని, లేదా తామే ఆ వారి వద్దకు వెళ్ళాలనే పట్టింపులు లేవని, అందరూ కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు. పార్టీ కోసం పాటుపడినవారెవరైనా సరే దరి చేర్చుకోవాలన్నది తన అభిమతమన్నారు. ప్రస్తుతం తాను పార్టీలో జంట నాయకత్వం అవసరమని చెప్పటం లేదని, సమైక్య నాయకత్వాన్నే బలపరుస్తున్నానని తెలిపారు. విలేఖరుల సమావేశంలో ఈపీఎస్ ను ‘నా ప్రియ సోదరుడు’ అంటూ ఆయన పలుమార్లు సంబోధించారు. అంతకు ముందు ఓపీఎస్ తన అనచరులతో కలిసి ఓమందూరార్ ఎస్టేట్లో ఉన్న వినాయకుడి ఆలయాన్ని, ఆళ్వార్పేటలోని ఆంజనేయస్వామి ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.