ఆర్టీసీలో ఈపీకే ఢమాల్‌

ABN , First Publish Date - 2020-08-10T10:12:54+05:30 IST

ఆర్టీసీలో కీలకంగా లెక్కకట్టే ఈపీకే(ఎర్నింగ్‌ పర్‌ కిలో మీటర్‌) కరోనా ప్రభావంతో గుంటూరు రీజియన్‌లో గణనీయంగా పడిపోయింది.

ఆర్టీసీలో ఈపీకే ఢమాల్‌

కరోనా ప్రభావంతో తగ్గిన ప్రజాదరణ

కిలో మీటరుకు రూ.11 నుంచి రూ.14 లోపే 


గుంటూరు, ఆగస్టు 9: ఆర్టీసీలో కీలకంగా లెక్కకట్టే ఈపీకే(ఎర్నింగ్‌ పర్‌ కిలో మీటర్‌) కరోనా ప్రభావంతో గుంటూరు రీజియన్‌లో గణనీయంగా పడిపోయింది. గతంతో పోల్చితే ప్రస్తుతం సగానికి పైగా దిగజారిపోయింది. దీంతో అధికారుల్లో ఆందోళన నెలకొంది. దాదాపు మూడు వారాల తరువాత శుక్రవారం నుంచి ప్రారంభమైన ఆర్టీసీ సర్వీసులకు ప్రజాదరణ అంతంతమాత్రంగా ఉంటోంది. తొలి రోజు రీజియన్‌ వ్యాప్తంగా ఈపీకే  రూ.11 రాగా మరుసటి రోజు రూ.14 మాత్రమే వచ్చింది. కిలో మీటర్‌కు వచ్చే ఆదాయాన్ని బట్టి ఆర్టీసీలో లాభనష్టాలను బేరీజు వేస్తుంటారు. ప్రస్తుతం ఆర్టీసీ బస్సుల్లో కూడా ప్రయాణికుల రేషియో సగానికి సగం తగ్గించటంతో ఓఆర్‌ను పరిగణలోనికి తీసుకోవటం లేదు.


కరోనాకు ముందు ఎక్స్‌ప్రెస్‌ బస్సులకు ఈపీకే రూ.34గా, పల్లెవెలుగు బస్సులకు రూ.28గా లెక్కకట్టి ఉన్నతాధికారులు ఆ దిశగా డిపోలకు లక్ష్యాలను నిర్దేశించేవారు. అయితే ప్రస్తుతం కరోనా నేపథ్యంలో ఉన్నతాధికారులు ఆ దిశగా ఈపీకేను కూడా తగ్గిస్తూ లక్ష్యాలను నిర్దేశించారు. రీజియన్‌ వ్యాప్తంగా ఈపీకే రూ.25 సాధించాలని లక్ష్యాలను పెట్టుకున్నారు. అయితే  తొలి రోజు అందులో సగం కూడా రాలేదు. ఇదే పరిస్థితి కొనసాగితే ఆర్టీసీ నష్టాలు మరింత చవిచూడాల్సిన పరిస్థితి నెలకొంటుందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 


కొవిడ్‌ -19 నిబంధనలతో ....

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే ప్రజల్లో కరోనా భయం పొగొట్టేలా డిపో మేనేజర్లు, సూపర్‌ వైజర్‌లు శనివారం రీజియన్‌ వ్యాప్తంగా పర్యటించారు. అంతేగాక కొవిడ్‌ -19 నిబంధనలను అనుసరిస్తూ బస్టాండ్‌లో శానిటైజర్లు వినియోగించటంతో పాటు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సీటింగ్‌లు మార్పులు చేశారు. కొద్ది రోజుల్లోనే ఆర్టీసీకి ప్రజాదరణ ఉంటుందన్న ఆశాభావం అధికారులు వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2020-08-10T10:12:54+05:30 IST