సుందరకాండ పారాయణం భేష్
ABN , First Publish Date - 2020-07-13T11:53:38+05:30 IST
కరోనా నేపథ్యంలో లోక కల్యాణార్థం శ్రీవారి ఆలయం ముందు నాదనీరాజనం వేదికపై టీటీడీ నిర్వహిస్తున్న సుందరకాండ ..
గర్భాలయంలో సిబ్బంది
చొక్కా తొడుక్కోకుండా చూడండి
శ్రీవారి సేవకులు నెట్టేస్తున్నారు
‘డయల్ యువర్ టీటీడీ ఈవో’లో భక్తులు
తిరుమల, జూలై 12 (ఆంధ్రజ్యోతి): కరోనా నేపథ్యంలో లోక కల్యాణార్థం శ్రీవారి ఆలయం ముందు నాదనీరాజనం వేదికపై టీటీడీ నిర్వహిస్తున్న సుందరకాండ పారాయణం భేషుగ్గా ఉందని పలువురు భక్తులు పేర్కొన్నారు. ఆదివారం డయల్ యువర్ టీటీడీ ఈవో కార్యక్రమం తిరుపతిలోని దేవస్థాన పరిపాలనా భవనంలో జరిగింది. ఈ సందర్భంగా ఈవో అనిల్కుమార్ సింఘాల్తో వివిధ ప్రాంతాల భక్తులు నేరుగా మాట్లాడి.. తమ ఫిర్యాదులు, సలహాలు, సూచనలు తెలియజేశారు. ఆన్లైన్లో వసతి గదిని బుక్ చేసుకునే సమయంలోనే అద్దెతోపాటు ఆ గది ఏ ప్రాంతంలో ఉందనే సమాచారం కూడా తెలియజేయాలంటూ సురేష్ (విజయవాడ), ఎయిర్టెల్ డిజిటల్లో ఎస్వీబీసీని తొలగిస్తామని చెబుతున్నారని మాధవి (బెంగళూరు) ఈవో దృష్టికి తెచ్చారు.
లాక్డౌన్ తర్వాత శ్రీవారి దర్శనానికి వస్తే శ్రీవారి సేవకులు భక్తులను నెట్టేస్తున్నారంటూ నాగమణి(తిరుపతి) ఫిర్యాదు చేశారు. ఆర్జిత సేవలను ఎప్పటి నుంచి ప్రారంభిస్తారని లోహిత(తిరుపతి), ఇంద్రాణి (బాపట్ల) ప్రశ్నించారు. ఎస్వీబీసీలో గోవిందనామాలు ప్రసారం చేయాలని శ్రీనివాస్(తాండూరు) విన్నవించారు. శ్రీవారి ఆలయ గర్భగుడిలో సిబ్బంది, శ్రీవారి సేవకులు చొక్కా తొడుక్కోకుండా విధులు నిర్వహిస్తే బాగుంటుందని సుబ్బారావు(వైజాగ్) సూచించారు. తన పరిధిలోని సమస్యలను పరిశీలించి.. పరిష్కరిస్తామని, మిగిలినవి బోర్డు దృష్టికి తీసుకెళతామని భక్తులకు ఈవో సమాధానమిచ్చారు.