జూమ్ వెబినార్లో 80 వేల మంది నమోదు
ABN , First Publish Date - 2020-05-29T08:41:11+05:30 IST
టీడీపీ మొదటిసారి ఆన్లైన్లో నిర్వహించిన మహానాడుకు ఘన స్పందన లభించింది.
టీడీపీ డిజిటల్ మహానాడుకు ఘన స్పందన
9 గంటల చర్చ
22 తీర్మానాలు
55 మంది ప్రసంగం
అమరావతి, మే 28 (ఆంధ్రజ్యోతి): టీడీపీ మొదటిసారి ఆన్లైన్లో నిర్వహించిన మహానాడుకు ఘన స్పందన లభించింది. జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమం నిర్వహించిన విషయం తెలిసిందే. బుధ, గురువారాల్లో కలిపి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దీనిని వీక్షించడానికి జూమ్ యాప్లో 80 వేల మంది నమోదు చేసుకున్నారు. వీరిలో అందరికీ అవకాశం రాలేదు. ఎవరైనా చూస్తూ మధ్యలో బయటకు వస్తే మరొకరికి అవకాశం లభించింది. సాంకేతిక సదుపాయం పరిమితంగా ఉండడడమే దీనికి కారణం. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు బెంగుళూరు, చెన్నై నగరాలకు చెందినవారు, విదేశాల్లో అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, గల్ఫ్ వంటి దేశాల్లో తెలుగువారు అధికంగా ఉన్నచోట్ల నుంచి దీనిలో పాల్గొన్నారు. మొత్తం 22 తీర్మానాలపై చర్చ జరిగింది.
తొమ్మిది గంటలపాటు జరిగిన చర్చలో 55 మంది నేతలు పాల్గొన్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఏడెనిమిది మంది పాల్గొనగా మిగిలిన వారంతా ఎవరి నివాసాల నుంచి వారు, కొందరు తమ పార్టీ కార్యాలయాల నుంచి పాల్గొన్నారు. ఆన్లైన్లో నిర్వహించినప్పటికీ పార్టీ శ్రేణుల నుంచి స్పందన బాగుందని, బాగా ఉత్సాహంగా రెండు రోజులపాటు దీనిని వీక్షించారని టీడీపీ వర్గాలు తెలిపాయి.