దర్యాప్తు బాధ్యత ఎన్ఏఐకు..
ABN , First Publish Date - 2022-02-23T17:46:48+05:30 IST
శివమొగ్గలో బజరంగ్దళ్ కార్యకర్త హర్ష దారుణహత్య, అనంతరం జరిగిన హింసాకాండపై ఎన్ఏఐతో దర్యాప్తు జరిపించే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు హోం మంత్రి ఆరగ జ్ఞానేంద్ర వెల్లడించారు. శాసనసభ లాంజ్లో
బెంగళూరు: శివమొగ్గలో బజరంగ్దళ్ కార్యకర్త హర్ష దారుణహత్య, అనంతరం జరిగిన హింసాకాండపై ఎన్ఏఐతో దర్యాప్తు జరిపించే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు హోం మంత్రి ఆరగ జ్ఞానేంద్ర వెల్లడించారు. శాసనసభ లాంజ్లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ మొత్తం వ్యవహారంలో కాంగ్రెస్ హస్తం ఉందన్న ఆరోపణలు ఉన్నాయని, వీటిని కూడా విచారణ పరిధిలోకి తెస్తామన్నారు. శివమొగ్గలో సోమవారం పరిస్థితిని నియంత్రించేందుకు పోలీసులు ఎంతగానో శ్రమించారని ఆయన కొనియాడారు. హర్ష హత్య వ్యవహారంలో ఇంటలిజెన్స్ వైఫల్యం ఎక్కడా లేదన్నారు. హింసాకాండ నేపథ్యంలో తన రాజీనామాకు కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ డిమాండ్ చేయడాన్ని ప్రస్తావించగా ఆయన బదులిచ్చేందుకు నిరాకరించారు. రాష్ట్రంలో శాంతి సామరస్యాలను కాపాడేందుకు ప్రభుత్వం తొలి ప్రాధాన్యం ఇస్తుందన్నారు. ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందన్న కాంగ్రెస్ ఆరోపణలను తోసిపుచ్చారు. హింసాకాండకు పాల్పడినవారు ఎవరైనా సరే వదిలిపెట్టబోమన్నారు. ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేయడం మాని శివమొగ్గలో శాంతిని కాపాడేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంతోపాటు ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.