‘బాలుడిపై దాష్టీకం!’పై విచారణ షురూ..

ABN , First Publish Date - 2020-08-15T09:43:24+05:30 IST

నిజామాబాద్‌ రూరల్‌ మండలం మల్కాపూర్‌ (ఎ)గ్రామంలో బుధవారం జరిగిన ఘటనపై అధికారులు..

‘బాలుడిపై దాష్టీకం!’పై  విచారణ షురూ..

హెచ్చార్సీ ఆదేశాలతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసిన కలెక్టర్‌

గ్రామంలో గుట్టుగా విచారించిన బృందం

మీడియాకూ వివరాలు చెప్పని వైనం 


నిజామాబాద్‌ రూరల్‌, ఆగష్టు 14: నిజామాబాద్‌ రూరల్‌ మండలం మల్కాపూర్‌ (ఎ)గ్రామంలో బుధవారం జరిగిన ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. శుక్రవారం ‘ఆంధ్రజ్యోతి’ మెయిన్‌లో ప్రచురితమైన ‘బాలుడిపై దాష్టీకం!’ వార్తను సుమోటోగా స్వీకరించిన హెచ్చార్సీ.. నిజామాబాద్‌ కలెక్టర్‌ను నివేదిక కోరిన విషయం తెలిసిందే. దీంతో కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి ఆదేశాలతో అసిస్టెంట్‌ లేబర్‌ కమిషనర్‌ యోహాన్‌, అసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీసర్‌ సలాం, చైల్డ్‌ ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌ చైతన్య, రూరల్‌ మండల రెవెన్యూ అధికారులతో కూడిన బృందం మల్కాపూర్‌ ( ఏ ) గ్రామానికి వెళ్లింది. బాలుడితో పాటు అతని తల్లిదండ్రులు, దాడికి పాల్పడ్డ ముద్దంగుల బాలయ్యను సైతం గ్రామ పంచాయతీ కార్యాలయానికి పిలిపించారు. గ్రామ సర్పంచ్‌ శేఖర్‌ గౌడ్‌, ఉపసర్పంచ్‌ వెంకట్‌ రెడ్డి, ఎంపీటీసీ దొంతు శాంత, పంచాయతీ కార్యదర్శుల సమక్షంలో వివరాలు అడిగి తెలుసుకున్నారు.


బాలుడిని కాళ్లు, చేతులు కట్టివేసి లాక్కెళ్లిన స్థలాన్ని  వెళ్లి చూశారు. జరిగిన ఘటనపై స్థానికంగా ఆరా తీశారు.  బాలుడు చెప్పిన వివరాలన్నీ అధికారులు వీడియో రికార్డు చేశారు. బాలుడి వయసుకు సంబంధించి కచ్చితమైన తేదీ లేకపోవంతో.. వయసు నిర్ధారణ చేయనున్నారు.అనంతరం జిల్లాకేంద్రంలోని లేబర్‌ కమిషనర్‌ కార్యాలయానికి గ్రామస్థులను, కులసంఘానికి చెందిన పలువురిని పిలిచి ఘటనకు సంబంధించిన పూర్వాపరాలు అడిగి తెలుసుకున్నారు. కాగా, అధికారుల బృందం  ఈ విచారణను గుట్టుగా కొనసాగించింది. ఈ అంశంపై మీడియాకు సమాచారం ఇవ్వలేదు. విచారణ సమయంలో ఇతరులెవరూ ఫొటోలు తీయకుండా అధికారులు ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. అదే సమయంలో విచారణకు సంబంధించిన వివరాలు కూడా మీడియాకు వెల్లడించడానికి ఇష్టపడక పోవడం గమనార్హం. 

Updated Date - 2020-08-15T09:43:24+05:30 IST